Anakapalle: 17 మంది చావుకు కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ.. ఇంత నిర్లక్ష్యమా?

అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌' కంపెనీలో జరిగిన ప్రమాదంలో కంపెనీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నివేదికలో తేలింది. ఇంత ప్రమాదం జరిగినా కూడా కంపెనీ యాజమాన్యం బాధితులను చూసేందుకు కూడా రాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

New Update
Anakapalle: 17 మంది చావుకు కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ.. ఇంత నిర్లక్ష్యమా?

Atchutapuram Blast : అనకాపల్లి జిల్లా (Anakapalle District) రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌ (SEZ) లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌' కంపెనీలో బుధవారం ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీళ్లకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కీలక విషయాలు వెల్లడించారు. ఈ ప్రమాదానికి మొదటగా రియాక్టర్ పేలుడు కారణమని భావించినా.. సాల్వెంట్‌ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

''కంపెనీలో సాల్వెంట్స్‌ లీకేజీలు జరుగుతుంటాయి. వీటిని అడ్డుకునేందుకు యత్నించగా.. టీబీఈ అనే గ్యాస్‌ విడుదలయ్యింది. ఆ తర్వాత ఈ గ్యాస్ పైపులైన్ల నుంచి ఏసీలోకి వెళ్లింది. ఈ గ్యాస్ పై అంతస్తు నుంచి కిందివరకు వ్యాపించింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ స్పార్క్‌ తగిలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చాలామంది ఇది రియాక్టర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదం అని అన్నారు. ఇది కేవలం గ్యాస్ లీకేజీ వల్ల మాత్రమే జరిగిన సంఘటన. ఇందులో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా ?.. లేదా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అనేది విచారణలో బయటపడుతుంది.

పేలుడు వల్ల ఈ భవనం మొత్తం కూలిపోలేదు. పైన ఉన్న రూఫ్‌, గోడలు కూలాయి. గ్యాస్ లీకేజీ వల్ల కొందరు మృతి చెందగా.. గోడ శిథిలాల కింద నలిగి మరికొందరు ప్రాణాలు కోల్పోయారని'' వంగలపూడి అనిత వివరించారు. అలాగే ఇంత ప్రమాదం జరిగినా కూడా కంపెనీ యాజమాన్యం దీన్ని పట్టించుకోలేదని.. తాను మెసేజ్ పెట్టినా కూడా ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెజ్‌లో ఉన్న చాలా కంపెనీలకు సేఫ్టీ ఆడిటింగ్ జరగడం లేదని.. సెఫ్టీ ఆడిటింగ్ చేస్తేనే ఆయా కంపెనీలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలుస్తుందని పేర్కొన్నారు. చివరికి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు థర్డ్ పార్టీ నివేదిక తేల్చిచెప్పింది.

ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ కంపెనీ ఎవరిదీ ?

ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (Escientia Advanced Sciences Private Limited) అనేది ఒక ఫార్మా కంపెనీ. ఇందులో బల్క్ డ్రగ్స్ తయారుచేస్తుంటారు. బల్క్ డ్రగ్ అంటే రోగులకు చికిత్స చేసేందుకు వాడే మందుల తయారీలో దీన్ని వినియోగిస్తుంటారు. ఉదాహరణకు నొప్పులను తగ్గించేందుకు చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పారసిటమల్ అనేది బల్క్‌ డ్రగ్‌. ఈ టాబ్లెట్‌తో నొప్పిని తగ్గించే మందులు తయారు చేస్తుంటారు. ఈ ఎసైన్షియా కంపెనీకి అమెరికా, అచ్యుతాపురంతోపాటు హైదరాబాద్‌లోనూ కంపెనీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ కంపెనీని పెండ్రి యాదగిరి అనే వ్యాపారవేత్త స్థాపించినట్లుగా ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఉంది. 2007లో ఆయన ఈ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(CEO) గా యాదగిరియే వ్యవహరిస్తున్నారు. ఇక కంపెనీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పెండ్రి కిరణ్ ఉన్నారు. వీళ్లి్ద్దరితో పాటు దండు చక్రధర్, అజిత్ అలెగ్జాండర్ జార్జ్, వివేక్ వసంత్ సవే డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే కోరాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి CFO (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా పనిచేస్తున్నాడు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో ఉన్నట్లు లింక్ట్‌ఇన్‌లో ఉంది. ఈ సంస్థలో 1001 నుంచి 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెబుతోంది.

publive-image

కనికరం లేదా ?

ఈ కంపెనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగినా కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో వీళ్లపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందడం, మరో 50 మంది గాయపడినా కూడా కనీసం వారిని చూసేందుకు రాకపోవడం వారి ప్రవర్తనకు అద్దం పడుతోంది. తమ కంపెనీలో పనిచేసే కార్మికులపై కనీస కనికరం చూపించకపోడవడంతో ఆ యజమాన్యం తీరుపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థర్ట్ పార్టీ నివేదికలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే.. వాళ్లు ఎలాంటి నాసీరకపు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా కార్మికుల పనికి సరైన భద్రతా లేకుండా నడిచే కంపెనీలను పూర్తిగా సీజ్‌ చేయడమే మంచిదని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలాఉండగా..ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడ్డవారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read : సల్మాన్ ఖాన్ కు ఆ సినిమా రీమేక్ చేయాలని ఉందట..!

Advertisment
తాజా కథనాలు