/rtv/media/media_files/2026/02/20/pet-dog-in-uttar-pradesh-2026-02-20-20-47-16.jpg)
ఉత్తర ప్రదేశ్లోని ఫతేపూర్లో ఒక చిన్న పెంపుడు కుక్క కారణంగా ఏకంగా ఒక పెళ్లే రద్దయిపోయింది. రెండేళ్లుగా ప్రేమించుకున్న ఒక జంట, పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆ శుభకార్యం కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
అసలేం జరిగింది?
ఫతేపూర్కు చెందిన యువతి, ప్రయాగ్రాజ్కు చెందిన యువకుడు గత నెలలోనే ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఈ నెల 18న (బుధవారం) మరోసారి బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వధూవరులు దండలు మార్చుకుంటున్న శుభ సమయంలో, మండపం దగ్గరున్న వధువు పెంపుడు కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
కుక్క అరుపులతో విసిగిపోయిన వరుడి తరపు బంధువు ఒకరు ఆ కుక్కను కాలితో తన్నాడు. తాను ప్రాణంగా పెంచుకునే కుక్కపై దాడి చేయడంతో వధువు తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇది ఇరువర్గాల మధ్య పెద్ద వాగ్వాదానికి దారితీసింది. మాట మాట పెరిగి, బంధువులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘర్షణలో వధువుతో పాటు పలువురికి గాయాలయ్యాయి.
పోలీసుల ఎంట్రీ - పెళ్లి రద్దు:
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా, తన పెంపుడు జంతువును గౌరవించని వారి ఇంటికి కోడలిగా వెళ్లనని వధువు తెగేసి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుని, పెళ్లిని రద్దు చేసుకున్నాయి. చివరకు కట్నకానుకల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చి, ఆ ప్రేమ జంట విడిపోయింది.
Follow Us