JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

'UPPRPB'రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60,244 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 50.14 లక్షల మంది అప్లై చేసుకోగా.. ఇన్ని దరఖాస్తులు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అన్నారు.

New Update
JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

LUCKNOW: ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల రాష్ట్రంలోని కానిస్టేబుల్ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 60,244 కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 50.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

చరిత్రలో మొదటిసారి.. 
అయితే 2009లో ఏర్పడిన 'ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ' (UPPRPB) చరిత్రలోనే ఇప్పటివరకు ఇన్ని దరఖాస్తులు రాలేదని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో ఇదే అతిపెద్ద అప్లికేషన్స్ ప్రక్రియగా పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ 27న అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమవగా.. 12,000 రిజర్వేషన్ సీట్ల కోటాకు 15 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 'ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్'కు లాస్ట్ డేట్ జనవరి 16 వరకూ అవకాశం కల్పించగా.. చివరిరోజు అర్ధరాత్రి దరఖాస్తులు వెల్లువెత్తినట్లు చెప్పారు. ఇక ఫీజు సర్దుబాటు, దరఖాస్తులలో సవరణలు జనవరి 20 వరకు సరి చేసుకునే అవకాశం కల్పించినట్లు యుపిపిఆర్‌పిబి చైర్‌పర్సన్ డిజి రేణుకా మిశ్రా తెలిపారు.

ఇది కూడా చదవండి : Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు

మూడు షిఫ్టుల్లో పరీక్షలు..
నిజానికి 32 లక్షల దరఖాస్తులు వస్తాయని బోర్డు అంచనా వేసిందని, కానీ ఇందుకు భిన్నంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరీక్షలు నిర్వహించడం సవాలుగా మారిందన్నారు. మొదట ఫబ్రవరి 18న ప్రతిపాదించిన పరీక్షల కోసం 6,500 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కానీ ఇప్పుడు 50 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో రెండు, మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే మొత్తం 4,844 కేంద్రాలు ఏర్పాటు చేయగా కమిషనరేట్‌ పరిధిలో 1,640 కేంద్రాలను బోర్డు ప్రతిపాదించింది. లక్నోలో అత్యధికంగా 832 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఒక పోస్ట్ కోసం 83 మంది..
ఇక ఒక పోస్ట్ కోసం దాదాపు 83 మంది పోటీదారులు ఉండగా.. సుమారు 35 లక్షల మంది పురుషులు, 15 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక పోస్టుకు పురుషుల విభాగంలో 66 మంది పోటీదారులు కాగా, మహిళా విభాగంలో 125 మంది ఉన్నారు. తొలిసారిగా చాలా మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ తర్వాత, యుపి పోలీసులు అత్యధిక సంఖ్యలో మహిళా సిబ్బందిని కలిగి ఉంటారని అధికారులంటున్నారు.

అదనపు ఏర్పాట్లు.. 
పరీక్షలకు సంబంధించి అదనపు ఏర్పాట్లను చేయడానికి బోర్డు రైల్వే, రోడ్‌వేస్ అధికారులతో సమావేశాలను కూడా నిర్వహిస్తుంది. సాల్వర్ గ్యాంగ్‌లను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని ఎస్టీఎఫ్, జిల్లా పోలీసులను కూడా కోరింది.  ఇది కాకుండా, పరీక్ష సమయంలో అనుమానితులను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు సహాయం కూడా తీసుకోబడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో కాపీయింగ్‌ను నిరోధించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని అధికారి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు