శ్రీవారి సేవలో..
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. నేడు తెల్లవారుజమున ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికి జ్ఞాపికలు , స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
అంతేకాదు.. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఇవాళ గడ్కరీ భారీ సభలో పాల్గొననున్నారు. సభలో జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం మదనపల్లెలో కేంద్ర మంత్రి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు బీటీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. మంత్రికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా స్వాగతం పలకనున్నారు. అనంతరం సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్వాస్థ్య హాస్పిటల్ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
భక్తుల రద్దీ..
ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తంగా 72 వేల 664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32 వేల 336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
మరోసారి చిరుత కలకలం
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం మొదలైంది. అయితే నిన్న రాత్రి మొదటి ఘాట్ రోడ్డులో రెండు చిరుతలు కనిపించాయి. కుక్కను వేటాడుతూ ఘాట్ రోడ్డు మీదకి వచ్చాయి. 56వ మలుపు వద్ద రోడ్డు మీద నుంచి పరుగెత్తిన చిరుతలను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొంత మంది వాహనదారులు వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. టీటీడీ అధికారులు, అటవీ శాఖా అధికారులు చిరుతలు సంచరించిన ప్రదేశానికి చేరుకున్నారు. తిరుమల విజిలెన్స్ సిబ్బంది వాహనాలను విడివిడిగా కాకుండా ఐదారు వాహనాలను కలిపి ఒకేసారి పంపిస్తున్నారు.
[vuukle]