తిరుమలలో రేపు(మంగళవారం) టీటీడీ నూతన పాలకమండలి సమావేశం కానుంది. నూతన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం జరగనుంది. శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు పెనక శరత్ చంద్రారెడ్డి, సీబీఐ కేసులో అరెస్ట్ అయిన కృష్ణమూర్తి వైద్యనాథన్ మినహా మిగతా 26 మంది సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. మంగళవారం ఉదయం బోర్డు సభ్యుడిగా శరత్ చంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పాలకమండలిపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు..
ఇటీవల 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి(Sarath Chandra Reddy) కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్ (Ketan Desai)ను కొనసాగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. వెంటనే అవినీతిపరులను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. అయినా కానీ టీటీడీ ముందుకే సాగుతోంది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ పాలకమండలి సభ్యులను పరిశీలిస్తే..
సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట)
పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం)
తిప్పేస్వామి (మడకశిర)
మాసీమ బాబు (కడప)
యానాదయ్య (కడప)
వై. సీతారామిరెడ్డి (కర్నూలు, మంత్రాలయం)
సుబ్బరాజు (ఉంగుటూరు)
నాగ సత్యం యాదవ్ (ఏలూరు)
శిద్ధా రాఘువరావు కుమారుడు సుధీర్ (ప్రకాశం)
అశ్వథామ నాయక్ (అనంతపురం)
డాక్టర్ శంకర్ (తమిళనాడు)
కృష్ణమూర్తి (తమిళనాడు)
దేశ్పాండే (కర్ణాటక)
పెనక శరత్ చంద్రారెడ్డి (తెలంగాణ)
ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి (తెలంగాణ)
అమోల్ కాలే (మహారాష్ట్ర)
సౌరభ్ బోరా (మహారాష్ట్ర)
మిలింద్ నర్వేకర్ (మహారాష్ట్ర)
కేతన్ దేశాయ్ (మహారాష్ట్ర)
బోర సౌరభ్ (మహారాష్ట్ర)
బాలుసుబ్రమణియన్ పళనిస్వామి (తమిళనాడు)
మేకా శేషుబాబు
రాంరెడ్డి సాముల
ఎస్ఆర్ విశ్వనాథరెడ్డి
ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు..
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు అధికారులు.