అలా కలిసి వచ్చింది వాటికి
కరోనా నుంచి ఆర్థిక ఇబ్బందులు మనుషుల జీవితంలో చాలా ఎక్కువ అయ్యాయి. అయితే ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందుల నుంచి నెగ్గటం చాలా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు ఉన్న తరానికి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 90 కోట్ల ఆస్తిని దక్కించుకున్నాయి వీధి కుక్కలు..నిజమే మీరు విన్నది.. ఎక్కడ అంటారా..? ఇది ఎక్కడో కాదు భారతదేశంలోని గుజరాత్లో జరిగింది. ఎన్నో పుణ్యాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తే గాని అంతా లక్కీ దొరకడం కష్టం. కానీ ఇక్కడ మాత్రం ఏమీ చేయకుండానే ఆ గ్రామ సింహాలకు అదృష్టం పట్టుకుంది.
ఏకంగా ట్రస్ట్తోటే నిధులు
ఆ గ్రామంలోని వీధి కుక్కలు కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా రూ.90 కోట్ల ఆస్తికి హక్కుదారులయ్యాయి. వాటి ఆస్తి నిర్వహణకు ఓ ట్రస్టు కూడా ఉంది. దీంతో ఆ గ్రామసింహాల లైఫ్స్టైలే మారిపోయింది. పెంపుడు కుక్కలు కూడా అసూయ పడేస్థాయిలో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. గుజరాత్లోని మెహసానా జిల్లా ఇందుకు వేదిక అయ్యింది.
వీటికే సేవ చేయాలని నిర్ణయం
జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజల బలమైన విశ్వాసం. దీంతో, నిత్యం కళ్లెదురుగా ఉండే వీధి కుక్కలకే సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వాటి కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి భారీ మొత్తాలను విరాళంగా ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఏకంగా కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులనే ఆ ట్రస్టుకు ధారాదత్తం చేశారు.
నిత్యం ప్రతి ఒక్కరు అందుబాటులో
ఇక కుక్కల సేవ కోసం భారీ యంత్రాంగమే ఏర్పాటు చేసుకున్నారు. శునకాలకు ఆహారం తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. వారు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. శునకాలు అనారోగ్యం పాలైతే వెంటనే వైద్యం అందించేందుకు ఓ పశు వైద్యుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ శునకాలు నిజంగానే ఎంతో అదృష్టం చేసుకున్నాయి కదా.