Basara: బాసరలో వసంత పంచమి...దేవాలయాల్లో జోరుగా అక్షరాభ్యాసాలు

వసంతపంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది.

New Update
FotoJet (7)

Vasant Panchami in Basara

Basara: వసంతపంచమి వేడుకలు రాష్ర్ట మంతటా వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ సరస్వతి పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకునేం దుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా తరలివచ్చారు. అర్చకులు అమ్మవారి సన్నిధిలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. వందలాది మందిని ఒకచోట కూర్చోబెట్టి పిల్లలతో అక్షరాలు దిద్దించారు.

FotoJet (8)

వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1.30 గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకంతో పాటు మంగళవాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. తెల్లవారు జామున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

FotoJet (9)

కాగా అక్షరాభ్యాసం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సీఐ కిరణ్‌, ఎస్సై నవనీత్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరఫున పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. ఉదయం 3.00 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లతోపాటు అక్షరాభ్యాస మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటలు, అక్షరాభ్యాస పూజకు రెండు గంటల సమయం పడుతోంది.

వర్గల్‌ సరస్వతి ఆలయంలో..

ఇంకోవైపు సిద్ధిపేట సమీపంలోని వర్గల్‌లో శ్రీసరస్వతి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి.ఇక్కడ కూడా అక్షరాభ్యాస కార్యక్రమానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సరస్వతి దేవిగా దుర్గమ్మ..

ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దుర్గమ్మ వారు.. ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ పాఠశాల విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. అదీకాక ఈ రోజు శుక్రవారం కూడా కలిసి రావడంతో.. దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు రానున్నారు. అందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisment
తాజా కథనాలు