/rtv/media/media_files/2025/01/15/823YxyPD3hwXk6zDbPqC.jpg)
ktr, supreme court Photograph: (ktr, supreme court)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 జనవరి 15వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. రేపు ఈడీ విచారించనుంది. ఫార్మలా ఈ రేసు విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు.
ఈ ఫార్ములా కేసు ఇదే..
2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రి గా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూ.755 కోట్లు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టింది.
కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు. కాగా దీనిపై గతంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను బయటపెట్టారు. దీనిపై విచారణను ఏసీబీకు అప్పగించింది రేవంత్ సర్కార్. ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్ట్ అనుమతి కొరకు గవర్నర్ కు లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.
Also Read : బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు