/rtv/media/media_files/2025/12/14/fotojet-3-2025-12-14-11-21-54.jpg)
Rs. 40 thousand per vote..
Telangana Panchayat Elections : రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్ జరుగుతుండగా ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. అభ్యర్థులు పోటీపడి ఓటు రేటు పెంచేశారు.
ఓటుకు రూ. 40 వేలు..సర్పంచ్ ఖర్చు రూ.17 కోట్లు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఒక గ్రామంలో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఒకరు ఎన్నికల్లో గెలవడానికి రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. సదరు అభ్యర్థి గ్రామంలోని ఒక్కో ఓటరుకు మూడు విడుతల్లో రూ.40వేల చొప్పున పంచినట్లు సమాచారం. కొందరు మహిళా ఓటర్లకైతే వెండిగ్లాసులు, చిన్నపాటి బంగారు నగలు కూడా పంపిణీ చేశారని తెలిసింది. 780 గృహాలున్న ఆ గ్రామం లో ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేయటంతో మద్యానికే రూ.4కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్నారు. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పెట్టిన భోజనాల ఖర్చే రూ.కోటి వరకు అయ్యిందని ప్రచారం సాగుతోంది.
ఓటుకురూ.15,000
రెండోవిడుత పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని పలు మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో ఓటుకు తక్కువలో తక్కువ రూ.3,000 నుంచి అత్యధికంగా రూ.15 వేల వరకు పంపిణీ చేశారు. జనరల్, బీసీ జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నచోట అభ్యర్థులు డబ్బుకు వెనుకాడకుండా ఖర్చు చేశారు.
ఓటుకు రూ.10 వేలు, ఫుల్ బాటిల్
నల్లగొండ జిల్లాలో కూడా అభ్యర్థులు పోటాపోటీగా నగదు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. తిరుమలగిరిసాగర్ మండలంలోని ఒక గిరిజన తండా పంచాయతీలో ఓటుకు రూ.4 వేల నగదు, ఇంటికి కిలో మటన్, ఫుల్ బాటిల్ మద్యం పంచారు. నిడమనూరు, అనుముల మండలాల్లో ఓటుకు రూ.3 వేల నగదు, క్వార్టర్ మద్యం, ఇంటికి కిలో చికెన్ పంపిణీ చేశారు. ఐదు గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా మిక్సీలు, ఫ్యాన్లు పంచారు.
ఓటు ధర రూ.10 వేలు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.8,000 నుంచి రూ.10 వేల వరకు పంచుతున్నట్టు ప్రచారం సాగుతుంది. గ్రామాల్లో అభ్యర్ధులు పోటీ పడడంతో డబ్బు పంపిణీ చేస్తున్నారు. సాధారణ సర్పంచ్ ఎన్నికలకు రూ.10 వేలు పంపిణీ చేయడంపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఆయా గ్రామాలకు పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుస్తుంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి అభ్యర్థులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి రూ.1,500 నగదు, ఇంటికి ఫుల్ బాటిల్ మద్యం, కేజీ చొప్పున మటన్, చికెన్ అందించారు. కొందరు చీరలు, మిక్సీలు కూడా పంపిణీ చేసినట్లు తెలిసింది.
మాంసం..చీరల పంపిణీ
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఓ పంచాయతీలో ఓటుకు రూ.7 వేల వరకు పంచారని తెలిసింది. కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలోనూ ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. చాలా గ్రామాల్లో ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నగదుతోపాటు మద్యం, మాంసం, చీరలు, పలు రకాల బహుమతులు కూడా పంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మహబూబ్నగర్ జిల్లాలో ఓట్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో ఒక్కో సర్పంచ్ అభ్యర్థి రూ.50-60 లక్షల వరకు ఖర్చుచేశారు. శనివారం రాత్రి ఓటుకు రూ.1,000-2,000 వరకు పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల నగదు, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓటుకు రూ.1,000తోపాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.గజ్వేల్ డివిజన్లోని ఓ గ్రామంలో సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి.. తాను రూ.15.50లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన ప్రత్యర్థి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రజలు తనవైపే నిలిచారని పేర్కొన్నారు. మరోవైపు గద్వాల జిల్లాలోని ఓ గ్రామంలో గెలిచిన అభ్యర్థి.. ఓడితే పరువు పోతుందన్న ఆలోచనతో 18లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. ఇది చూస్తుంటే రాజకీయంపై విరక్తి కలుగుతోందని వాపోయాడు.
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వెండి ఉంగరాలు
నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు శనివారం రాత్రి ఇంటింటికి తిరిగి ఓటర్లకు బొట్టు పెట్టి.. రూ.1,000 నగదు, మద్యం, చికెన్తో కూడిన కవర్ను చేతిలో పెట్టి ఓటు అడిగారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు వెండి ఉంగరాలు పంచారు. కరీంనగర్. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2,000 వరకు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా జౌల(కే) గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థి బోయిన్వాడ్ వినోద్కు స్వగ్రామంలో ఇల్లు లేకపోవటంతో ఎన్నికల ప్రచారం సమయంలో బస చేసేందుకు తాత్కాలికంగా రూ.6 లక్షలతో కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు.
Follow Us