/rtv/media/media_files/2025/11/14/ncp-man-2025-11-14-07-21-37.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కాగా మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్న క్రమంలో అన్వర్ మృతి చెందడం కలకలం రేపింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది.
కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో
ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఫలితాలను 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్కు సుమారు 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
Follow Us