హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ షాక్ ఇచ్చారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ డీజేలపై నిషేధం విధించారు. ఇకపై నగరంలో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో ఎలాంటి డీజేలు, డీజే సౌండ్ యాంఫ్లిఫైర్లు, మిక్సర్లతో సహా అధిక సౌండ్ని ఇచ్చే ఎలాంటి పరికరాలను హైదరాబాద్ సిటీలో అనుమతించేది లేదని కమిషనర్ సీవీ ఆనంద్ అఫీషియల్గా తెలిపారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో పండుగలు, ఊరేగింపులు సమయంలో అధిక సౌండ్ గల పరికరాలు ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యం, శాంతి భద్రతల ఉల్లంఘన, సౌండ్ పొల్యూషన్ అధికంగా పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మతపరమైన ఊరేగింపుల సమయంలో ఎలాంటి క్రాకర్స్ (పటాసులు)తో పాటు డీజే సౌండ్ సిస్టమ్లను అనుమతించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఇటీవలే డీజేల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధిక సౌండ్ పొల్యూషన్ గురించి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రెసిడెన్సియల్ ఏరియాల్లో వృద్దుల ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు పిల్లల చదువుకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొన్నారు.
డీజే సిస్టమ్స్ నుంచి అధిక డిసిబెల్ సౌండ్ ఎక్కువగా వినడంతో ఆరోగ్యానికి చాలా హానికరం అని.. ఇది వినికిడి లోపం, అధిక రక్తపోటుకు, మానసిక ఒత్తిడికి కారణం అవుతుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఈ డీజే సౌండ్ సిస్టమ్ల నుంచి వచ్చే సంగీతం యువతలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దాని కారణంగా ఇది వారిలో క్రమశిక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది అని కమిషనర్ ఆనంద్ పేర్కొన్నారు.
చార్మినార్ ఇన్సిడెంట్
దీనికి ఉదాహరణగా ఇటీవల చార్మినార్లో మతపరమైన ఊరేగింపులో డీజే సిస్టమ్లు, పటాసులు వాడకం వల్ల జరిగిన డేంజర్ ఇన్సిడెంట్ను హైలైట్ చేశారు. సెప్టెంబర్ 19న చార్మినార్ వద్ద ఒక మతపరమైన ఊరేగింపులో డీజే సిస్టమ్ కోసం ఉపయోగించే జనరేటర్లో మంటలు చెలరేగాయి. దానికి కారణం ఆ సమయంలో ఉపయోగించిన పటాసులే అని అన్నారు.
ఆ సమయంలో అన్నీ కంట్రోల్ చేయడంతో సర్దుమనిగిందని.. లేకపోతే పరిస్థితి తీవ్రంగా మారేదని చెప్పుకొచ్చారు. అందువల్ల ఇకపై హైదరాబాద్ నగరంలో మతపరమైన ర్యాలీలు, జులూష్లలో డీజేలు వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అనుమతి అవసరం అని తెలిపారు. వీటితో పాటు నగరంలో వివిధ ప్రాంతాలలో సౌండ్ సిస్టమ్ల కోసం అనుమతించే డెసిబుల్ లిమిట్స్ను వివరించారు.
ఇండస్ట్రియల్ ఏరియాలో పగటిపూట 75 dB, రాత్రిపూట 70 dB
కమర్షియల్ ఏరియాలో పగటిపూట 65 dB, రాత్రిపూట 55 dB
రెసిడెన్సియల్ ఏరియాలో పగటిపూట 55 dB, రాత్రిపూట 45 dB
సైలెన్స్ జోన్ ఏరియాలో పగటిపూట 50 dB, రాత్రి పూట 40 dB
ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా, ఐదేళ్లు జైలు శిక్ష తీసుకుంటామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.