/rtv/media/media_files/2025/09/12/congress-2025-09-12-14-36-53.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం పలు కీలక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 15 వార్డులకు గానూ ఏకంగా 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని సొంతం చేసుకోగా, బీఆర్ఎస్ 3, బీజేపీ ఒక స్థానానికి పరిమితమయ్యాయి. అలాగే పెద్దపల్లి జిల్లా మంథనిలో కూడా కాంగ్రెస్ తన పట్టును చాటుకుంది. ఇక్కడి 13 వార్డుల్లో 11 స్థానాలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ ఇతరులు చెరో వార్డును దక్కించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పరం అయ్యాయి. బిచ్కుందలో 12 వార్డులకు గానూ 10 స్థానాలను, ఎల్లారెడ్డిలో కూడా అదే రీతిలో 12 వార్డులకు గానూ 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లోనూ ఇదే జోరు కొనసాగింది. అక్కడ 12 వార్డుల్లో 8 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, 4 వార్డులు బీఆర్ఎస్కు దక్కాయి. అటు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 15 స్థానాలకు గానూ ఇప్పటివరకు వెల్లడైన 10 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే జయకేతనం ఎగురవేయడం విశేషం.
మరోవైపు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. మొత్తం 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలను దక్కించుకుని మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ ఇక్కడ 4 వార్డులకే పరిమితం కాగా, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు.
Follow Us