CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం సీరియస్‌ యాక్షన్..! కీలక ఆదేశాలు జారీ.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయానీకై కాంగ్రెస్‌ పార్టీ చివరి ఓటు పడే వరకు అప్రమత్తంగా ఉంది. ప్రతి ఓటరిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి, వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేయడానికి నేతలకు బాధ్యతలు అప్పగించారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో(Jubilee Hills by Election) విజయం సాధించాలనే దృఢసంకల్పంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. చివరి ఓటు పడేవరకూ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రతి ఓటరిని ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూడాలని ఆదేశించారు.

రాష్ట్ర రాజధానిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్‌, ఈసారి జూబ్లీహిల్స్‌లో ఏకైక విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత, పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటు గెలిస్తే నగరంలో కాంగ్రెస్‌ బలం పెరుగుతుందని నేతలు భావిస్తున్నారు.

మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం 

సోమవారం ఉదయం తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రులతో ప్రత్యేక అల్పాహార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంగళవారం జరిగే పోలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, చివరి నిమిషం వ్యూహాలపై చర్చించారు. ప్రతి డివిజన్‌లో జరిగిన ప్రచారం, ప్రజల స్పందన, ఓటర్ల ధోరణిపై మంత్రులు సీఎంకు వివరాలు అందజేశారు.

ప్రచారం సమయంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్‌ రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో చర్చ ఎక్కువగా ఉందని మంత్రులు తెలిపారు. ఆ అంశాలను పోలింగ్‌ రోజున కూడా ఓటర్లకు గుర్తు చేయాలని సీఎం సూచించారు.

ఓటర్ల హాజరుపై ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్‌ నేతలు ప్రతి ఓటరిని ఓటు వేయడానికి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారు పోలింగ్‌ కేంద్రాలకు సులభంగా చేరేలా వాహనాల సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఓటింగ్‌ రోజు సెలవు దినంగా భావించి కొందరు ఇంట్లోనే ఉండకూడదని, వారిని తప్పనిసరిగా ఓటు వేయడానికి ప్రోత్సహించాలనే స్పష్టమైన సూచనలు సీఎం నుంచి వచ్చాయి.

ఉప ఎన్నికపై సీఎం సీరియస్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రులను బాధ్యతలు అప్పగించి, ప్రచారం సమన్వయం చేశారు. స్వయంగా ప్రచార ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు.

జూమ్‌ మీటింగ్‌లు, సమీక్షల ద్వారా ఆయన నిరంతరం నేతలతో సంప్రదిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. ఎక్కడ కాంగ్రెస్‌ వెనుకబడిందో తెలుసుకుని అక్కడ బలపడే వ్యూహాలు రూపొందించారు. క్షేత్రస్థాయి సర్వేల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు.

చివరి ఓటు వరకు ఫోకస్‌

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. “చివరి ఓటు పడే వరకు నిర్లక్ష్యం వద్దు” అనే ఆదేశం ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకు మార్గదర్శకం అయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వారీగా నేతలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి బూత్‌ వద్ద పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. మొత్తానికి, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయమే పార్టీ గౌరవ ప్రతిష్ఠగా మారింది. అందుకే సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి మొదలుకుని తక్కువ స్థాయి కార్యకర్తల వరకు అందరూ ఒక్కటై, చివరి ఓటు పడేవరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు