బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

author-image
By Bhavana
Cm Revanth Reddy
New Update

Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కౌశిక్‌ రెడ్డి ఇంటి వెలుపల జరిగిన గొడవ ,ఆ తరువాత జరిగిన అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 

మల్లారెడ్డి హౌస్ అరెస్ట్…

కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయనను పోలీసులను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను కలవడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ నివాసానికి బయలుదేరిన మల్లారెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు మొదలు పెట్టారు. కరీంనగర్ నగర అధ్యక్షుడు హరి శంకర్, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ భర్త సురేష్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రవీణ్‌లను ముందస్తుగానే అరెస్టులు చేశారు.

హరీష్ రావు ఆగ్రహం…

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీష్‌ రావు అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి , బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం కాంగ్రెస్‌పాలన అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు.

రేవంత్‌ సీరియస్‌..

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ , బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునివ్వడం మరింత కలకలం రేపింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి రేవంత్‌ సూచించారు.

Also Read: కేజ్రీవాల్‌ కి బెయిల్‌

#Arekapudi Gandhi #cm-revanth-reddy #mla-koushik-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe