నైరుతి రుతపవనాల రాక ఈ ఏడాది కొంత ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. అయితే ఇప్పుడు రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనుండగా.. ఆ తర్వాత తెలంగాణను కూడా తాకనున్నాయని తెలిపారు. అయితే ఈనెల ఆదివారం లోపు తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు తెలిపారు. అనంతంరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక.. తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలతో సహా పలు జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. బుధవారం అత్యధికంగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాగా మెదక్ జిల్లాలో కనిష్టంగా 25.2 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
అలాగే రుతు పవనాల రాక ఆలస్యం కావటంతో రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దని సూచిస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాతే విత్తనాలు వేయటం మంచిదని చెబుతున్నారు. ఈనెల 18న రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నందున సరిపడ వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని అన్నదాతలకు అధికారులు పలు సూచనలు చేశారు.