Telangana Politics: ఇప్పుడేం చేద్దాం! బీఆర్‌ఎస్‌లో చేరిన నేతల్లో అయోమయం

తెలంగాణ ఎన్నికల ఫలితం పలువురు నేతలను సందిగ్ధంలో పడేసింది. వివిధ కారణాలతో పార్టీలను వీడి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన వారి అంచనాలను ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయి. తదుపరి కార్యాచరణ, రాజకీయ ప్రణాళికలపై వారంతా ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు.

New Update
Telangana Politics: ఇప్పుడేం చేద్దాం! బీఆర్‌ఎస్‌లో చేరిన నేతల్లో అయోమయం

Politics Of Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితం పలువురు నేతలను సందిగ్ధంలో పడేసింది. వివిధ కారణాలతో పార్టీలను వీడి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ (BRS)లో చేరిన వారి అంచనాలను ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయి. తదుపరి కార్యాచరణ, రాజకీయ ప్రణాళికలపై వారంతా ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఐదేళ్లు వేచిచూడడమా, లేదంటే తిరిగి వెళ్లడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కాంగ్రెస్‌ నుంచి పెద్దసంఖ్యలో ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌ కండువా వేసుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్దన్ రెడ్డి హస్తం పార్టీ (Congress Party)ని వీడారు. నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్దన రెడ్డి కారెక్కారు. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మట్టా దయానంద్, కోడూరి సుధాకర్ కూడా పార్టీని వీడారు. జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్, భువనగిరి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి హస్తం గూటిని వీడి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ నుంచి ముఖ్య నేత చెరుకు సుధాకర్‌ కూడా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు బైబై చెప్పారు. మల్కాజిగిరి నుంచి నందికంటి శ్రీధర్ ది కూడా అదే పరిస్థితి. వారితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి జనగామకు చెందిన పొన్నాల లక్ష్మయ్య, మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడ నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దేవరకొండ నాయకుడు బిల్యానాయక్ వంటి ప్రముఖులు కూడా ఎన్నికలకు కొన్నిరోజుల ముందే కాంగ్రెస్‌ను వీడి అప్పటి అధికార పార్టీని ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు

బీజేపీ (BJP) నుంచి కూడా చాలా మంది నాయకులు ఎన్నికల వేళ అనేక అంచనాలతో అధికార పార్టీని ఆశ్రయించారు. మానకొండూరుకు చెందిన కళాకారుడు, గాయకుడు దరువు ఎల్లన్న, హజూర్ నగర్‌ కు చెందిన గట్టు శ్రీకాంత్ రెడ్డి, సిరిసిల్లకు చెందిన ముఖ్య నేత తుల ఉమ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్‌ ఆశించి భంగపడిన రాకేశ్ రెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అచ్చ విద్యాసాగర్ తదితరులది కూడా ఇప్పుడిదే పరిస్థితి.

ఇది కూడా చదవండి: ఎన్నికల కోడ్‌ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

వైఎస్సార్టీపీ నాయకుడు గట్టు రామచందర్‌ రావుతో పాటు, ఆ పార్టీ నేత, కళాకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న కూడా గులాబీ గూటికి చేరారు.

భవిష్యత్‌ కార్యాచరణపై వారంతా ఇప్పుడు తర్జనభర్జనలు పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారు మరీ ఇరకాటంలో పడ్డారు. పార్టీలోనే కొనసాగుతూ అధికార పార్టీ విధానాలపై పోరాడతారా లేదంటే తిరిగి హస్తాన్నే ఆశ్రయిస్తారా అన్నది వేచిచూడాలి. ఒకవేళ తిరిగి సొంతగూటికే చేరినా మునుపటి ప్రాధాన్యం లభిస్తుందా అన్నది సందేహమే. నామినేటెడ్‌ పోస్టులో, ఎమెల్సీ సీట్లో ఆశించి తిరిగివెళ్లినా ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకే అవి రిజర్వ్‌ అయిపోయుంటే పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచిస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్, సభ్యుల పదవుల్లో నియామకాల వరకూ వేచిచూడాలని కూడా కొందరు భావిస్తున్నారు. అయితే, తాము పార్టీపై కోపంతో బయటకు రాలేదని, చిన్నచిన్న అసంతృప్తులు, మనస్పర్థల కారణంగా పార్టీ వీడామని వారు చెప్తున్నారు. వారి భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటన్నది మరికొన్ని రోజులో తేలనుంది.

Advertisment
తాజా కథనాలు