అదీ ఒక రకమైన భూ కబ్జానే..
కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా.. కులాల వారీగా భూముల కేటాయింపును ధర్మాసనం తప్పుబట్టింది. కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. సాయి సింధు ఫౌండేషన్కు భూకేటాయింపు రద్దును ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ రకంగా భూములు కేటాయించడం ఒక విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది.
విచారణ ఆగస్టుకి వాయిదా
ఈ సందర్భంగా అణగారిన వర్గాలకు ఇస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. బలమైన కుల సంఘాలకు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. 2021లో ఖానామెట్లో కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేయూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఆయన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి అనుమతి ఇచ్చింది. కమ్మ, వెలమ సంఘాలకు భూకేటాయింపులపై విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది.
చర్యలు తెలపాలని గతంలోనే ఆదేశం
మరోవైపు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటులో జాప్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఛైర్మన్, సభ్యులను నియమించట్లేదన్న పిల్పై ధర్మాసనం విచారించింది. నియామకానికి తీసుకున్న చర్యలు తెలపాలని గతంలోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే రెండు వారాల సమయం ఇవ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. ఏజీ విజ్ఞప్తిని అంగీకరించిన హైకోర్టు. విచారణను జులై 18కి వాయిదా వేసింది.
నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ…
మరోవైపు ఫార్మాసిటీకి వెయ్యి ఎకరాల దేవాలయ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టేటస్కో విధించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం, నందివనపర్తి గ్రామాల్లో ఓంకారేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1022 ఎకరాలను భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి దేవదాయ భూమి సేకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నలుగురు రైతులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దీనికి సంబంధించిన గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని.. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
[vuukle]