TG news: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పాఠశాలలకు ఉచిత కరెంట్!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రజా ప్రభుత్వంలో విద్యతోపాటు గురువులకు ప్రాధాన్యత ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు.

New Update
TG news: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ పాఠశాలలకు ఉచిత కరెంట్!

TG news: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రజా ప్రభుత్వంలో విద్యతోపాటు గురువులకు ప్రాధాన్యత ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు.

publive-image

విద్యుత్ శాఖకు ప్రభుత్వమే చెల్లిస్తుంది..
ఈ మేరకు గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు (27, 862) ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుందని చెప్పారు. బిల్లులను విద్యుత్ శాఖకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో డీఎస్సీనీ నిర్వహించలేదని, ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.

విద్యా విధానం మారాలి..
'రాబోయే రోజుల్లో మరో 6వేలపైగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారుచేసి ముందుకు పోతున్నాం. గత పది సంవత్సరాల పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతికి, బదిలీలకు నోచుకోలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 45 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేశాం. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాం. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా విధానం మారాలని పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించాం. ప్రభుత్వం రూ.667 కోట్ల రూపాయలను వెచ్చించింది' అని చెప్పారు.

గత పాలనలో గురువులే స్వీపర్లు..
ఇక పాఠశాలలో స్వీపర్లు లేకపోవడం వల్ల గురువులే పాఠశాలను క్లీన్ చేసుకోవాల్సిన దుస్థితి గత పాలనలో నెలకొందన్నారు. ఆ పరిస్థితి పోవాలని ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ.136 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు పరిశ్రమలకు పనికొచ్చే సిలబస్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి కూడా వెనకడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాష్ట్రంలో 63 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసి.. అదునాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు.

రూ.300 కోట్ల రూపాయలు కేటాయించాం..
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్ల రూపాయలు కేటాయించాం. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గురువుల ఆలోచనలు కచ్చితంగా తీసుకుంటాం. ఉపాధ్యాయులు, గురువులతో  మాట్లాడి చర్చించిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తయారు చేస్తాం. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలి. విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఎదుర్కొని సమాజానికి ఉపయోగపడతారు. సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులే అన్నారు.

గురువులు అభ్యుదయ భావాలతో ఉండాలి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మీడియం చెప్పాలని.. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయులు అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. సమాజ నిర్మాణంలో ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుంది.‌ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు