మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్

ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ కోసం అంచెలంచులుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు.

New Update
మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్

CM Revanth Reddy: మెట్రో విస్తరణ, ఫార్మాసిటీని (Metro And Pharma City) రద్దు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ మెట్రోకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ (BHEL) నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు (MGBS to Shamshabad) వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కు మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: TS Politics: 30 రోజుల్లో రేవంత్ సాధించింది ఆ ఒక్కటే.. బూర నర్సయ్య గౌడ్ సెటైర్లు

తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో (Hyderabad Metro) విస్తరణకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని వివరించారు. ఫార్మాసిటీ కోసం అంచెలంచులుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో పొల్యూషన్ ఉండేలా ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకు గృహనిర్మాణం కూడా ఉంటుందన్నారు. వారెవ్వరూ హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు.

సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయనీ.. స్కిల్స్ అదనంగా ఉంటాయని తెలిపారు. వారందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్నారు. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామన్నారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా బాధ్యతలు అప్పగించామన్నారు. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామన్నారు.

మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉందని వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ నెల 3న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తనుకు దగ్గరనో.. బంధువలనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పదవులు భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించామని.. వారికి అవసరమైన మ్యాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తాను చూస్తానన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నానన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఉండదన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు