AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్
మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు