6 జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్
తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మొత్తం 6 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో 24 గంటల్లో రాష్ట్రం అంతటా ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 6-10కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.
ఆలస్యంగా రుతుపవనాలు
రాబోయే 24 నుండి 48 గంటల్లో రుతుపవనాలు మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేస్తాయి. ప్రస్తుతం, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వేడి ప్రేరేపిత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయని ఐఎండీ సీనియర్ అధికారి తెలిపారు. సాధారణంగా, ఋతుపవనాలు జూన్ 8-10 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించి.. జూన్ 12-14 నాటికి రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి. ఈ ఏడాది 12 రోజులు ఆలస్యమైంది.
నీట మునిగిన కార్లు
నగరంలోని ఎల్బీనగర్, ఘట్కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్ట, బాలానగర్, చింతల్, కూకట్పల్లి, మాదాపూర్, బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖాజీపేట 1.2 మి.మీ, గచ్చిబౌలిలో 2 మి.మీ, మాదాపూర్ 1.5 మి.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, యాదాద్రిలో భారీ వర్షపాతం నమోదు కాగా, పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి.
వానలే వానలు..
కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలంగాణలోని తూర్పు, ఉత్తరాన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.