అవినీతి అంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ : స్మృతి ఇరానీ

తెలంగాణ సర్కార్ అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అవినీతి అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్, బీఆర్ఎస్ అని రెండు పార్టీలపై ధ్వజమెత్తారు. దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మృతి ఇరానీ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
అవినీతి అంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ : స్మృతి ఇరానీ

Smriti Irani Fires On BRS and Congress: రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఆరోపించారు. దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మృతి ఇరానీ హాజరై మాట్లాడారు. తెలంగాణ సర్కార్ పై, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.

‘‘దుబ్బాక నవరాత్రులు ముగిసిన తర్వాత రఘునందన్ రావు సంకల్పం ఒక్కటే.. అధర్మం నాశనం కావాలి.. ధర్మం గెలవాలనేది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని అందరం కలిసి కొట్లాడినం.. కానీ ఏవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.40 వేల కోట్లతో ప్రారంభించి లక్ష కోట్లకు పెంచారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప కేసీఆర్‌ ప్రజలకు చేసింది ఏమీ లేదు. తన స్వార్థం కోసం తెలంగాణ యువతను వంచించింది కేసీఆర్ ప్రభుత్వం. మనల్ని మోసం చేసిన కేసీఆర్‌ను ఎదిరించే రఘునందన్ వైపు ప్రజలు నిలబడాలి. అల్లుడు, మామ, కొడుకు, బిడ్డతో కొట్లాడి గెలిచిన నాయకుడు రఘునందన్ రావు.’’ అని తెలిపారు.

‘‘కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వాక్సినేషన్ అందించిన ఘనత నరేంద్ర మోదీది. కేసీఆర్, రాహుల్, సోనియాగాంధీ అధికారంలో ఉంటే కరోనా వాక్సినేషన్ ఇచ్చేవారా ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులు బాగుండాలనే లక్ష్యంతో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్, రేషన్ బియ్యం ఉచితంగా మోదీ పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ కట్టించారో ఆలోచించండి. దళిత బంధు పథకంలో 30% కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యే లను హెచ్చరించారంటే వారి అవినీతి ఎంతో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గీతం ఎందుకు రాష్ట్ర గీతం ప్రకటించలేదో కేసీఆర్ చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు.

‘‘మోసం చేసే కేసీఆర్ వైపు ఉంటారా?.. అభివృద్ధి చేసే మోదీ వైపు ఉందామా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అవినీతి అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్‌కే చేరుతుంది. ఇది 2018లో చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఎంఎస్పీ పెంచి రైతులను ఆదుకుంది మోదీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. వడ్లు కొనుగోలుకు 2014-20 వరకు రూ.27 వేల కోట్ల మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. వాటితో పాటు పత్తికి లక్ష 7 వేల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయలేదు. సిద్దిపేటకు రైలు తెచ్చి ప్రజల కలను నెరవేర్చిన నాయకుడు మోదీ. రామగుండం ఫర్టీలైజర్ కంపెనీ ఓపెన్ చేసి ఎరువుల కొరతను తీర్చిన ఘనత మోదీది. 2014 వరకు జాతీయ రహదారులు 2500 కి. మీ అయితే మోదీ వచ్చాక మరో 2500 కి. మీ నిర్మించారు. కమలం గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి.’’ అని స్మృతిఇరానీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు