/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/srirama-navami-2024-jpg.webp)
Seeta Rama Kalyanam on Dussehra: చైత్రమాసం శుద్ధనవమి రోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకులను ఘనంగా జరుపుకుంటుంది. జగదేకవీరుడైన శ్రీరామచంద్రుడి కల్యాణోత్సవంతో ఆ రోజు ప్రతిఊరు మురిసిపోతుంది. శ్రీరామనవమి రోజు అన్ని గ్రామాల్లో రామాలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. అయితే ఇందుకు భిన్నంగా దసరా రోజు శ్రీరామచంద్రుని కల్యాణం చేసే గ్రామం ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమభక్తుని పాలెంలో (Bhima Bakthuni Palem) విజయదశమి రోజు శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఆ రోజే రాములోరి కల్యాణం జరుగుతుంది.
అమలాపురం పట్టణానికి సమీపంలో ఉన్న భీమభక్తునిపాలెంలో శ్రీరామనవమి కేవలం పానకాల ఉత్సవంగా జరుపుకుంటారు. ఊర్లో ఉన్న రామాలయంలో పానకాలు పంచిపెడుతుంటారు. ఇక రాములవారి కల్యాణం మాత్రం దసరా రోజు నిర్వహిస్తారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? గతంలో ఈ గ్రామంలో నివసించే వారంతా నేత కార్మికులు. వీరికి వేసవికాలంలోనే ఎక్కువగా పని ఉండేది. దీంతో ఎండాకాలంలో వీరంతా పనుల కోసం బయటకు వెళ్లేవారు. గ్రామంలో ఎవరూ ఉండకపోవడంతో శ్రీరామనవమి రోజు ఉర్లో ఉన్న కొంతమంది మాత్రం శ్రీరాముడికి పూజలు చేసి పానకాలు పంచి పెట్టేవారు.
దసరా నాటికి పనులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చేవారు. అందుకే దసరా రోజు రాములోరి కల్యాణం నిర్వహించి శ్రీరాముడి పట్టాభిషేకం చేశారు. అయితే కాలాలు మారినా కూడా ఆ ఊరి జనం మాత్రం అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీరామనవమి రోజు పానకాలు పంచిపెట్టి..దసరా రోజు ఘనంగా రామకల్యాణం నిర్వహిస్తారు.