మావోయిస్టు పార్టీలో మరో కీలక నేత మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి(70) మృతి చెందారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అయితే రాజిరెడ్డి మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రాజులపల్లి గ్రామం. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో రాజిరెడ్డి కీలకంగా పనిచేశారు. రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్పాండే లాంటి పలు పేర్లతో మారువేషాల్లో ఆయన తిరిగేవారు.
1975లో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ(RSU)లో చేరారు. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. వివాహమై ఒక కూతురు జన్మించిన తర్వాత 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్వార్ పార్టీలో చేరారు. మంథని, మహదేవ్పూర్ ఏరియా దళంలో పని చేసి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1977లో ఆయనను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. బెయిల్పై వచ్చాక ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
1986లో పూర్వ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ పోలీస్స్టేషన్పై దాడి జరిపి ఒక ఎస్ఐ, 12 మంది పోలీసులను కాల్చి చంపారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్పై మెరుపుదాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 1996-97లో ఆయనను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకుంది. 2007 డిసెంబరులో కేరళలోని అంగన్మలైలో ఉమ్మడి ఏపీ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో డిసెంబరు 18న, మంథని కోర్టులో డిసెంబరు 22న హాజరు పరిచారు. 14 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు. అ తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.