Sankranti 2024 సంక్రాంతి వచ్చిందోచ్.. ఈ పండుగ ప్రత్యేకతలు ఇవే...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి కనిపిస్తుంది. కోడిపందాలు, ముగ్గులు, గాలపటాలతో అనందం వెల్లి విరుస్తుంది.

New Update
Sankranti 2024 సంక్రాంతి వచ్చిందోచ్.. ఈ పండుగ ప్రత్యేకతలు ఇవే...

సంక్రాంతి పండుగ (Sankranti Festival ) భారతీయ పండుగలలో ముఖ్యమైన పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణం సమయంలో ఈ పండుగ వస్తుంది.  మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం అవుతుంది. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకువచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, పిండి వంటలు. గంగిరెద్దులు.

ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.  ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఇది.

సంక్రాంతి పండుగ సందర్భంగా పిండివంటలకు ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోదగినవి సకినాలు. ఈ పండుగ సందర్భంగా పాఠశాలలకు వారం నుంచి పది రోజులపాటు సెలవులు ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో సకినాలు చుట్టే కార్యక్రమం వారం ముందే మొదలు పెడుతారు.

సంక్రాంతి (Sankranti) మూడు రోజుల పండుగ. తొలి రోజు పండుగను భోగి అని పిలుస్తారు. ఈ రోజు భోగిమంటలు వేస్తారు. దీనికి కారణం అప్పటి వరకు ఉన్న చలిని ప్రారదోలటం ఒక కారణమైతే, ఇంట్లో ఉన్న పాత వస్తువులు చీపుర్లు, తట్టలు, విరిగి పోయిన బల్లలు, టేబుల్లు వంటివి మంటల్లో వేసి తగులబెడుతారు. దీనికి ఆర్థం పాత వస్తువులను వదిలేసి కొత్త వాటిని ఉపయోగించటం అనే సంప్రదాయం ఇందులో ఇమిడి ఉంది. అంటే కొత్త జీవితాన్ని  ఆరంభించడానికి గుర్తుగా ఇలా చేస్తారు. అలాగే ఈ మంటల్లో కాచిన నీటితో పిల్లలకు భోగి స్నానాలు చేయిస్తారు. రేగు పండ్లతో బోగి పండ్లు పోస్తారు. ఆ తర్వాత ఇంటిముందు అందంగా అలికి రంగురంగుల ముగ్గుల వేస్తారు.  ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటి చుట్టూ నవధాన్యాలు, రేగు పండ్లు ఉంచుతారు.  ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పిండివంటలు ఆరగిస్తారు. సాయంత్రం పూట పిల్లలు బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. వారి వద్ద ఉన్న బొమ్మలకు తోడు కొత్త బొమ్మలు కొని వాటిల్లో ఉంచుతారు. బంధువులు, పేరంటాల్లను పిలిచి వాయినాలు ఇచ్చుకుంటారు.

రెండవరోజు సంక్రాంతి పండుగ జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే ఇంటిముందు అలికి ముగ్గులు పెట్టి తొలిరోజులాగే గొబ్బెమ్మలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు.  ప్రత్యేకంగా చక్కరపొంగలి వంటి తీపి వంటకాలు చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం అనేది ఆనవాయితీ.  ఇక గంగిరెద్దుల వారు రంగురంగుల వస్త్రాలతో అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ వాటిని ఆడిస్తుంటారు. అదే సమయంలో హరిదాసులు సందడి చేస్తారు.

ఇక మూడవరోజు కనుమ పండుగ పేరుతో జరుపుతారు. ఇది మనకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువుల కోసం జరుపుకునే పండుగ.  ఈ రోజును పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. కాళ్లకు గజ్జెలు కడుతారు. వివిధ రకాల అలంకార వస్తువులతో వాటిని అందంగా ముస్తాబు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పందెలు, ఎండ్లబండ్ల పోటీలు, కోడిపందెలు, రాళ్లు లాగుడు పందెలు నిర్వహిస్తారు. ఇక ఈ రోజున మాంసహారం తినడం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజున దేవతలకు కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించి మాంసంతో విందులు ఆరగిస్తారు.

Advertisment
తాజా కథనాలు