తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు వేతనాలు పెంపు

తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

New Update
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు వేతనాలు పెంపు

తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 583 మంది కళాకారులను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించింది. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.24,514 వేతనం ఇస్తుండగా తాజా పెంపుతో రూ.31,868 జీతం అందనుంది. ఇప్పుడు అమల్లోకి వచ్చిన పీఆర్సీ ప్రకారం ఒక్కొక్కరి జీతం దాదాపు 7,300 మేర పెరగనుంది. కొత్త వేతనాలు 2021 జూన్‌ 1 నుంచి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

publive-image

తమ గళాల్ని, కలాల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన కళాకారులకు 2015లో ఉద్యోగాలిచ్చారు. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రగతి గీతాలను ఆలపిస్తూ, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో కళాకారుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ కళాకారుల వేతనాలను పీఆర్సీసీ-2020 పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. తాజాగా కేసీఆర్ ఆమోదంతో అధికారికగా తుది ఉత్తర్వులు జారీ చేశారు. కళాకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచడంతో పాటు సామాజిక భద్రతకు వేతనాల పెంపు నిర్ణయం దోహదం చేస్తోందన్నారు.

వేతనాల పెంపు పట్ల కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాంస్కృతిక సారథి చైర్మన్‌ బాలకిషన్‌, ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఇటీవలే రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పదవీ విరమణ చేసిన అంగ‌న్‌వాడీ టీచర్లకు రూ.ల‌క్ష, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లతో పాటు హెల్పర్లకు రూ. 50వేల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్టు ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత ఆస‌రా పింఛన్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు