కేసీఆర్.. నువ్వు వస్తావో, కేటీఆర్‌ను పంపుతావో.. నేను రెడీ: రేవంత్ రెడ్డి

తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కేసీఆర్.. మీరు వస్తారో,కేటీఆర్‌ను పంపుతారో, హరీష్‌ను పంపుతారో తేల్చుకోమని సవాల్ విసిరారు.

New Update
కేసీఆర్.. నువ్వు వస్తావో, కేటీఆర్‌ను పంపుతావో.. నేను రెడీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి వ్యక్తి మరణించారని తెలిసినా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తండ్రికొడుకులు చర్చను రేవంత్ రెడ్డి చుట్టూనే తిప్పారన్నారు. సభలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీలో తాను చంద్రబాబు శిష్యుడిని కాదని.. సహచరుడిని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచాకే తాను టీడీపీలో చేరానని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ప్రస్థానం టీడీపీలో చంద్రబాబు అనుచరుడిగా మొదలైందని గుర్తుచేశారు. నిలువ నీడ లేని కేసీఆర్‌కు టీడీపీనే ఆధారమైందన్నారు.

తెలంగాణ పట్ల తన నిబద్ధత ఎప్పుడూ మారలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో ముందు వరుసలో ఉన్నానని తెలిపారు. కానీ కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. 1996లో 610 జీవో, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్ అని పేర్కొన్నారు. 1996లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని కేటీఆర్‌కు సూచిస్తున్నానని చెప్పారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారమైందని 13 జూన్ 2014లో శాసనసభలో కేసీఆర్ చెప్పలేదా అని గుర్తించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారు? అని ప్రశ్నించారు.

తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంది.. నిలదీసింది తాను అని రేవంత్ తెలిపారు. చంద్రబాబు సహచరుడుగా ఉన్నా ఆనాడు తెలంగాణపై తన నిబద్ధత మారలేదన్నారు. ఆనాడు గవర్నర్‌పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యానని గుర్తుచేశారు. 24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించానన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పానన్నారు. ఎవరికి తలవంచకుండా తెలంగాణ కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను తాను అని పేర్కొన్నారు. కేసీఆర్ నీ పార్టీ బతికిందే కాంగ్రెస్‌తో.. కాంగ్రెస్ లేకపోతే నువ్వు, నీ కుటుంబం అడుక్కు తినేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తన అవసరానికి ఓసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న కిషన్ రెడ్డి.. 2011లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంది నిజం కాదా? అని నిలదీశారు. శాసన మండలి ఎన్నికల్లో ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారన్నారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన జగన్‌ను ప్రగతి భవన్ పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్ అన్నారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ దుర్మార్గుడన్నారు. లాలూచీలో కేసీఆర్‌ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరంటూ వ్యాఖ్యానించారు.

గద్దర్ మొదలుపెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలి.. ఆయన చివరి కోరిక, స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని తెలిపారు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న తనతో చెప్పారని గుర్తుచేసుకున్నార. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని..కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారన్నారు. ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు.. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడ్డారన్నారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే తాను విజ్ఞత ప్రదర్శించానని చెప్పారు. తాను లేవనెత్తిన అంశాలపై తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమన్నారు. నువ్వు వస్తావో,కేటీఆర్‌ను పంపుతావో, హరీష్‌ను పంపుతావో తేల్చుకోమని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి 25కు మించి సీట్లు రావు.. అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు