బీఆర్ఎస్కు రాజీనామా
బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పడమర్తి రవిలు బిఆర్ఎస్కు రాజీనామా చేశారు. కనకయ్యతోపాటు ఆయన అనుచరులు చాలామంది పార్టీకి రాజీనామాలు చేశారు. కనకయ్యతో పాటు 56 మంది సర్పంచ్లు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జేడ్పీటీసీ బీఆర్ఎస్కి రాజీనామా సమర్పించారు. ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని వీరంతా ఈరోజు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సభకు..
ఇల్లందు జడ్పీ క్యాంపు కార్యాలయంలో రాజీనామాల తర్వాత కనకయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభలో ఆ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. ఇల్లందు నియోజకవర్గంలోని మండలాల నుంచి జూలై 2న ఖమ్మంలో జరిగే ఈ కాంగ్రెస్ సభకు వేలాది మంది ప్రజలు హాజరవుతారని చెప్పుకొచ్చారు.
తీర్మానం పెట్టండి అంటూ సవాల్
పొంగులేటితో కోరం కనకయ్య గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీనిమీద స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్ పదవికి పోరం కనకయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కోరం కనకయ్య బదులిస్తూ తనను రాజీనామా చేయమని కోరడం కాదు అవిశ్వాసం తీర్మానం పెట్టండి అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో కోరం కనకయ్య జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇకపోతే కాంగ్రెస్లో చేరడం మీద కొద్దిరోజుల్లో నిర్ణయం చెబుతానని గతంలో ప్రకటించిన పిడమర్తి రవి.. ఈ రోజు తాను అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రేపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పొంగులేటితో పాటు కాంగ్రెస్లో చేరబోతున్నారు.