రాజ్యమార్గం ద్వారా స్వామివారి దర్శనం
శ్రీవాణి ట్రస్ట్ నిధులపై 70 మంది దళారులను అరెస్ట్ చేశామని... 214 కేసులు నమోదు చేశామన్నారు. 2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి శ్రీవాణి ట్రస్ట్కు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 860 కోట్లను దాతలు సమర్పించారని అన్నారు. 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం చేసుకున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన భక్తులకు రాజ్యమార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని..సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.
రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు
వివిధ కార్యక్రమాలకు గాను రూ.120.24 కోట్లు ఖర్చు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8 లక్షల మందికిపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా.. ఎవరు టీటీడీపై ఆరోపణలు చెయ్యలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళితే రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారన్నారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెపితే పరిశీలించి రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చెయ్యడం తగదని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.