/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ncc-jpg.webp)
మహారాష్ట్రలోని థానేలో ఓ సీనియర్ జూనియర్ల పట్ల ప్రవర్తించిన తీరు సంచలనం సృష్టిస్తోంది. విద్యా ప్రసారక్ మండల్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు ఎన్సీసీ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షకుడిగా ఓ సీనియర్ను నియమించారు. అయితే ఆ సీనియర్ విద్యార్థులను బురదలో పుష్ ఆప్ పొజిషన్స్ చేయాలని ఆదేశించాడు. అయితే కొంతమంది విద్యార్థులు సరిగా చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. బురదలో ఉన్న విద్యార్థుల వెనక భాగంలో కర్రలతో బలంగా కొట్టాడు.
దీంతో ఆ దెబ్బలు తట్టుకోలేక కొందరు విద్యార్థులు బోరున ఏడ్చేశారు. కొట్టొద్దంటూ వేడుకుంటున్నాఆ సీనియర్ వదలకుండా కొడుతూనే ఉన్నాడు. నొప్పి భరించలేక పడిపోయిన విద్యార్థులను కాళ్లతో తన్నాడు. నొప్పి భరించలేక బాధడుతున్న వారిని శారీరకంగా హింసిస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఈ ఘటనను ఓ విద్యార్థి తన మొబైల్లో వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. శిక్షణ పేరుతో ఇలా చేయడం దారుణమని మండిపడుతున్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను కొట్టినట్లు కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై ఎన్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పట్ల కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ స్పందిస్తూ దీనిని సీరియస్గా తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. సీనియర్ ఎన్సీసీ క్యాడెట్పై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశారు. గత 40 ఏళ్ల నుంచి కాలేజీలో ఎన్సీసీ ప్రోగ్రామ్లు జరుగుతున్నాయని ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవలేదని ఆమె వెల్లడించారు. ఆర్మీ, నేవీ భవిష్యత్ అవకాశాల దృష్ట్యా విద్యార్థులను తయారుచేయడానికి జోసి-బేడెకర్ క్యాంపస్లో మూడు కాలేజీల విద్యార్థులకు ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణ సమయంలో విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు.