Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. హీరోయిన్ల సీక్రెట్స్ రికార్డ్!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కొందరు సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తి గత సమాచారాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. అయితే.. వారి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. హీరోయిన్ల సీక్రెట్స్ రికార్డ్!
New Update

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనంగా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు కూడా తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పలువురిని విచారిస్తున్నారు. అయితే కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు మాత్రమే ట్యాప్‌ చేశారా..? లేదా ఇతరుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారా..? అసలేం జరిగింది..? అన్ని వర్గాల వ్యక్తులపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం రాజకీయ నాయకులు, వ్యాపారులే కాదు.. ఈ వ్యవహారంలో సినిమా తారల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దానికంటే ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు సమాచారం. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిద్వారా ఓ రాజకీయ పార్టీకి ఎక్కువ మొత్తంలో డబ్బులు సమకూర్చినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ తారల్లో కలకలం..

కాసేపు రాజకీయ కోణం పక్కనబెడితే.. సినిమా వాళ్ల ఫోన్ల ట్యాపింగ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. సినీ తారల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు..? చేసి ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు..? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సినీ హీరోయిన్లకు సంబంధించి.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సమంత లాంటి ప్రముఖ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు తెలుస్తోంది. దాంతో పాటు మరికొంతమంది తారల ఫోన్లూ ట్యాప్‌ అయినట్లు సమాచారం. వారిలో హీరోయిన్లు పూజా హెగ్డే, అనుష్క, తమన్నా.. హీరోలు నాగార్జున, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు.. అధికారులు తమకు అందిన సమాచారాన్ని బట్టి నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అసలు సినీ తారల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ట్యాప్‌ చేసిన సమాచారాన్ని సేకరించి దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందారు..? సినీ తారల సంభాషణలు విన్న తర్వాత వాటితో ఏం చేశారు..? అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్‌ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో.. తాజా ఫోన్‌ ట్యాపింగ్‌ అగ్రశ్రేణి హీరో హీరోయిన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

సమాచారాన్ని ఎలా వాడుకున్నారు..?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్‌ రావు తీగ లాగితే డొంక కదిలిన సంగతి తెలిసిందే. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు.. ఇలా పెద్ద తలకాయలన్నీ బయటకొస్తున్నాయి. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరంతా విచారణ సమయంలో కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించి డబ్బుల వ్యవహారాలు, ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే వ్యవహారం, ప్రత్యర్థుల ఫోన్లు విని వాళ్లకు సంబంధించి కార్యకలాపాలను కట్టడి చేయడం, వ్యాపారులకు సంబంధించిన లావాదేవీల అంశాలను సేకరించి.. అందులో అధికారులు వేలుపెట్టి డబ్బులు వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఏం తేలబోతుంది..? ఏం జరగబోతుంది..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు సంబంధించిన ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశారు..? ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అగ్రశ్రేణి తారల ఫోన్లనే ఎందుకు ట్యాప్‌ చేశారన్నది తేలాల్సి ఉంది. దాంతో పాటు టాలీవుడ్‌లో ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశారు..? అసలు ఏం జరిగింది..? ఆ సమాచారాన్ని ఏం చేశారు..? ఫోన్‌ ట్యాప్‌ చేసిన తర్వాత దాన్ని ఏరకంగా వినియోగించారు..? దాని ద్వారా వాళ్లను అనుకూలంగా ఎలా మార్చుకున్నారు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల విచారణలో మున్ముందు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణలో రోజుకో కొత్త సంచలన విషయం బయటపడుతోంది. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌లో మున్ముందు టాలీవుడ్‌ తారల విషయం ప్రధానాంశంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#phone-tapping-case #heroines-phone-tap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి