ఇటీవల కాలంలో జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న అంతుచిక్కని వ్యాధులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే మానవాళికి తీరని నష్టం జరగగా ఇటీవల అమెరికాలో పెంపుడు కుక్కలు వింత వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో కుక్కలు శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డట్లు అధికారికంగా ప్రకటించారు.
Also read :హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్
ఈ మేరకు అమెరికాలో పెంపుడు కుక్కలకు కారణం తెలియని శ్వాసకోశ వ్యాధి సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఓరెగాన్ రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఇప్పటివరకు 200 కేసులు వైద్యాధికారుల దృష్టికి వచ్చాయని తెలిపారు. 'కొలరాడో, న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రాల్లోనూ శునకాలు ఈ వ్యాధిబారిన పడ్డాయి. రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ తమ పరిశీలనకు శాంపిళ్లు వస్తున్నాయి' అని న్యూ హ్యాంప్షైర్ విశ్వవిద్యాలయంలో పశు వైద్య పరిశోధకుడు డేవిడ్ నీడిల్ చెప్పారు. ఏడాది కాలంగా ఈ వ్యాధి తమ దృష్టికి వస్తోందన్నారు. దీనివల్ల శునకాలలో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కానప్పటికీ, పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్త పడాలని సూచించారు. దగ్గు, తుమ్ములు, ముక్కువెంట, కళ్ల నుంచి నీరు కారడం, బద్ధకం ఈ వ్యాధి లక్షణాలు. యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదు. ఈ రుగ్మతలకు కారణాలేమిటో శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. సకాలంలో కుక్కలకు టీకాలు వేయించాలనీ, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే జంతు వైద్యుల వద్దకు వెళ్లాలని యజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలను కొంతకాలంపాటు కుక్కలకు దూరంగా ఉంచాలని, లేదంటూ ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా జనాలు కలవరపడుతున్నారు.