తిక్కంటాడు.. దానికో లెక్కంటాడు
జనసేన అధినేత పవన్, మాజీ మంత్రి కన్నాపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి వారాహి మీద ఊగిపోతున్నాడన్నారు. పవన్ ఒక తిక్కలోడు.. అధికారంలోకి తీసుకొని రమ్మంటాడు… ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో చెప్పడని విమర్శించారు. వారాహి బ్యాచ్కి ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని పోటీ చేయాలో తెలీదు కానీ బీజేపీతో పొత్తు అంటాడు… చంద్రబాబుతో మాట్లాడతాడు.
కూలిపోవడం ఖాయం
వెండితెరపై పవన్ను హీరోలా చూసే అవకాశం ఉందని, రాజకీయాల్లో మాత్రం కమెడియన్గా కనిపిస్తోందన్నారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని, ప్రస్తుతం ఉన్న రాజకీయ దృశ్యాన్ని విశ్లేషించి, పవన్ కళ్యాణ్ రాజకీయ విధానంలో స్పష్టత లేదన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో వస్తాదులను కుప్పకూల్చడం ఖాయం అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఎవ్వరిని వదిలేది లేదు..
మరొవైపు మాజీ మంత్రి కన్నాపై విమర్శలు చేశారు.. కన్నా మైకు దొరికితే అవాకులు చవాకులు పేలుతున్నాడు. సత్తెనపల్లికి ఆయన వచ్చాడు నేను ఎప్పుడో వచ్చానో చెప్పాలన్నారు . కన్నా లాగా పార్టీలు.. నియోజకవర్గాలు మారిన వ్యక్తి నేను కాదన్నారు. సత్తెనపల్లి నుంచి 3వ సారి సీఎం జగన్ ఆశీస్సులతో మళ్ళీ పోటీ చేస్తా… సత్తెనపల్లి పోలీసులను అడ్డుపెట్టుకొని పరిపాలన చేస్తానని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నన్ను వస్తాదు పోలీస్ స్టేషన్లో కుర్చోబెడతాడంట. నా నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తే సహించను. ఆఖరికి వైసీపీ కార్యకర్తలైన సరే అని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజల ఆశీర్వదం ఉంది..
ఏపీలో గత 4 ఏళ్లగా సీఎం జగన్ చిత్తుశుద్ధితో పరిపాలన అందిస్తున్నారు. రాష్ట్రంలోని కోట్లాది మంది లబ్ధిదారులకు సీఎం జగన్ రూ. 2 లక్షల కోట్లకుపైగా డబ్బులు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారని వివరించారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేసే దమ్ము చంద్రబాబు.. పవన్కు ఉందా అని సవాల్ విసిరారు.