సిద్ధాంతాలు ముఖ్యం
ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే సిద్ధాంతాలు చాలా ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. షర్మిల పార్టీ పెట్టినప్పుడు తాను అభినందించానని, అలా పార్టీలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ, ప్రస్తుతం వారు పార్టీని ఉంచుతారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. కాంగ్రెస్లో కలిపేస్తారని తాను కూడా వార్తలు వింటున్నానని అన్నారు. సీఎం బిడ్డలైనా, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నా కూడా రాజకీయ పార్టీకి అవి సరిపోవని అన్నారు. తాము డబ్బులు లేకపోయినా పార్టీని ఎలా నడపగలుగుతున్నామని అన్నారు. భావతీవ్రత, సైద్ధాంతిక బలం, వైఎస్ఆర్సీపీ లేదా ఇతర పార్టీల ఆరాచకాలను ఎదిరించే తత్వం తమకు ఉంది కాబట్టే, పార్టీని నడిపించగలుగుతున్నామని అన్నారు. ఐడియాలజీ అనేది చాలా ముఖ్యమని అన్నారు. తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.
ఐడియాలజీ సరిపోదు
టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఎందుకు మారిందని అడిగారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్భవించిన ఒక పార్టీ ఇప్పుడు భారత దేశానికి పని చేస్తామనేలా పేరు మారిదంటే.. కొంత కాలానికి చిన్న ఐడియాలజీ సరిపోదని అన్నారు. పెద్ద ఐడియాలజీ తీసుకుంటారని అన్నారు. ఇవన్నీ లేకుండా జనసేన ఏడు బలమైన యూనివర్సల్ ప్రిన్సిపల్స్ పాటిస్తోందని అన్నారు. కొంత కాలం తర్వాత భారతదేశపు రాజకీయాల్ని ఆ ఏడు సూత్రాలే నిర్దేశిస్తాయని అన్నారు.
సీఎం జగన్ రౌడీ పిల్లాడు
రాష్ట్రంలో అవినీతి అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇదే సమయంలో జగన్ తనకు శత్రువు కాదని అతనికంత సీన్ లేదంటూ సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపైనే తమ పోరాటమని. బ్రిటిష్ వాళ్లే పారిపోయినప్పుడు జగన్ ఎంత అని మండి పడ్డారు. గురువారం సాయంత్రం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ రౌడీ పిల్లాడని వ్యాఖ్యానించారు. జగన్. జగ్గు భాయ్ అంటూ పవన్ వ్యంగ్యంగా విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగ్గు భాయ్ నీ ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసని పవన్ స్పష్టం చేశారు.