Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి అంటే (సోమవారం - సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ప్రత్యేక సమావేశం అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తరువాత సాధారణ సమావేశాలేనని క్లారిటీ ఇచ్చింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నేటి నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సభా కార్యక్రమాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సెషన్లో 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణంపై చర్చించాలని, ఎన్నికల కమిషనర్ల నియామకంతో పాటు నాలుగు బిల్లులను పరిశీలించాలని కేంద్రం ప్రతిపాదించింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి?
పాత పార్లమెంట్ హౌస్లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు (సెప్టెంబర్ 19) పాత పార్లమెంట్ హౌస్ లోనే ఫోటో సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఎంపీలు కొత్త పార్లమెంటు భవనానికి వెళతారు. సెప్టెంబరు 19న కొత్త భవనంలో సెషన్ సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 20 నుంచి సాధారణ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 17) ఉదయం కొత్త పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ప్రత్యేక సెషన్లో ఏయే అంశాలపై చర్చిస్తారు, ఏయే బిల్లులు ప్రవేశపెడతారు?
సెషన్లో ఎజెండాలోని ప్రధాన అంశాలలో ఒకటి రాజ్యాంగ సభ నుండి ప్రారంభమయ్యే 75 సంవత్సరాల పార్లమెంటు ప్రయాణం గురించి చర్చించడం. పార్లమెంటు పర్యటనలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న విషయాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలతో కూడిన బిల్లు కూడా ఆమోదం కోసం లిస్ట్ చేయబడింది. వర్షాకాల సమావేశాల్లో దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇక అడ్వకేట్స్(సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ జర్నల్స్ రిజిస్ట్రేషన్ బిల్ 2023 ఈ ఎజెండాలో ఉన్నాయి. అయితే, ఈ బీ బిల్లుకు ఇప్పటికే ఆగస్టు 2, 2023న రాజ్యసభలో ఆమోదం లభించింది. ఇక పోస్టాఫిస్ బిల్లు 2023 కూడా లోక్సభ కార్యకలాపాలలో లిస్ట్ చేశారు. ఈ బిల్లును 10 ఆగష్టు 2023న రాజ్యభసభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లిస్టెడ్ ఎజెండా కాకుండా పార్లమెంట్లో కొన్ని కొత్త చట్టాలు లేదా ఇతర అంశాలను ప్రవేశపెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే కొత్త చట్టానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా, లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ప్రవేశపెడతారనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశంలో, జి 20 శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడం, చంద్రునిపై చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడం గురించి ప్రధానంగా చర్చిస్తారు. అంతేకాదు.. ఈ సెషన్లో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్', దేశం పేరును 'ఇండియా' నుంచి 'భారత్'గా మార్చే ప్రతిపాదనను కూడా తీసుకురావచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి.
Also Read:
Minister Harish Rao: అవన్నీ వారంటీ లేని గ్యారెంటీలు.. కాంగ్రెస్పై హరీష్ ఫైర్
Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్కి ఉన్న లింకేంటో తెలుసా?