ప్రజలను భయపెడుతున్న పెద్దపులి
ప్రకాశం జిల్లా అర్దవీడు సమీప నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని లోయ సమీప పల్లె వాసులను పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోనే ఉంటూ లక్ష్మీపురంతో పాటు అయ్యవారిపల్లి, నాగులవరం, చింతమల్లెలపాడు పరిసరాల్లో తిరుగుతోంది. ఆయా గ్రామాల సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లోని నీటితో దాహం తీర్చుకుంటోంది. తాజాగా అయ్యవారిపల్లి పంచాయతీ చింతమల్లెలపాడు సమీపంలోని పెండ్లిరాజయ్య నీటి కుంట వద్దకు పెద్ద పులి రావడాన్ని జీవాల కాపరులు ఆదివారం గమనించారు. పొలాల దారుల్లో పులి జాడలను గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలిపారు. కాకర్ల వెలిగొండ ప్రాజెక్ట్ ఆనకట్ట సమీపంలోని మొట్టిగొంది, పాలనరవ ప్రాంతాన్ని తన ఆవాసంగా మార్చుకున్నట్టు భావిస్తున్నారు. మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పులి జాడ తరచూ కనిపిస్తున్నప్పటికీ అధికారులు రక్షణ చర్యలు తీసుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రామాల వాసులను హెచ్చరించేలా సూచనలు కూడా చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
నిఘా పెట్టిన అధికారులు
గతంలొ కూడా దోర్నాల మండలంలో పులుల జాడ గతంలో కనిపించగా అటవిశాఖ అధికారులు చాకచక్యంగా వాటిని అడవిలోకి మళ్లించారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో నీటి లభ్యత లేక అడవి నుండి పులి బయటకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల పులుల సంచారం పెరిగి లక్ష్మీపురం సమీపంలోని పశువులపై దాడి చేసి చంపివేసిన ఘటన తలచుకుంటూ ప్రజలు భయాందోళన గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం నిరంతర నిఘా ఏర్పాటు చేసి పులిని అటవీ ప్రాంతంలోకి తరిమి వేసేందుకు తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు.