One Nation-One Election Committee: దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటుకై ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత 8 మందితో కూడిన కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ నియామకానికి సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉంటారు. న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలకు హాజరవుతారు.
ఏ అంశంపై అధ్యయనం చేస్తారు?
నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా భారత రాజ్యాంగం, ఇతర చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కమిటీ పరిశీలించి సిఫార్సులు చేస్తుంది. నిబంధనలు, ప్రయోజనాలు, రాజ్యాంగంలో నిర్దిష్ట సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951, అందులోని నియమాలు, అవసరమయ్యే సవరణలు పరిశీలించి సిఫారసు చేస్తుంది ఈ కమిటీ. హంగ్ హౌస్, అవిశ్వాస తీర్మానం ఆమోదించడం, ఫిరాయింపుల వంటి పరిస్థితులలో ఎలాంటి చర్యలు తీసుకోవాల వంటి అంశాలపై కమిటీ విశ్లేషించి, సాధ్యమైన పరిష్కారాలను సిఫారసు చేస్తుంది. ఎనిమిది మంది సభ్యుల కమిటీ ఎన్నికల సమకాలీకరణ కోసం ఒక ఫ్రేమ్వర్క్ను సూచిస్తుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే కాలపరిమితిని కూడా సూచిస్తుంది. 'ఈవీఎంలు, వీవీప్యాట్లు మొదలైన వాటితో సహా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన లాజిస్టిక్స్, సిబ్బంది అంశాలను కమిటీ పరిశీలిస్తుంది' అని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది.
'ఒక దేశం-ఒకే ఎన్నికలు' అంటే ఏమిటి?
1967 వరకు రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో, 1970లో లోక్సభ రద్దయిన తర్వాత కొన్ని శాసనసభలు ముందస్తుగా రద్దు చేయడం జరిగింది. ఫలితంగా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లను మార్చవలసి వచ్చింది. లా కమిషన్ తన 170వ నివేదికలో ఎన్నికల ఖర్చులను ఆదా చేయడం, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. లోక్సభకు, అన్ని శాసనసభలకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన విధించాలని లా కమిషన్ నివేదిక పేర్కొంది.
లోక్సభ ఎన్నికలు 2024 జరిగే సమయానికి ముందు లేదా ఆ సమయంలో కనీసం 10 రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్గఢ్లలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణం చూపకుండా సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ప్రకటించడంతో.. ఒక దేశం-ఒకే ఎన్నికలపై చర్చ మళ్లీ మొదలైంది.
Also Read: