మోదీ హ్యాట్రిక్‌ కన్ఫర్మ్‌!.. ఏబీపీ సీ-ఓటర్‌ సంచలన సర్వే

ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే తేల్చింది. ఆ కూటమి 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది.

New Update
మోదీ హ్యాట్రిక్‌ కన్ఫర్మ్‌!.. ఏబీపీ సీ-ఓటర్‌ సంచలన సర్వే

ABP Lok Sabha Election Survey 2024: ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే తేల్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో 352 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన కూటమి ఈ సారి కూడా 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి (India Alliance) 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 35 నుంచి 65 సీట్లలో గెలిచే అవకాశముందని పేర్కొన్నది. 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వెల్లడైన తొలి ఒపీనియన్‌ ఇదే కావడంతో సర్వత్రా చర్చనీయమైంది.

ఇది కూడా చదవండి: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే!

తూర్పు, పశ్చిమాల్లో కమలానిదే హవా
పశ్చిమ భారత్‌లో 78 సీట్లలో ఎన్డీఏ (NDA) కూటమి 45 నుంచి 55 సీట్లలో, ప్రతిపక్ష కూటమి 25 నుంచి 35 సీట్లలో గెలవొచ్చని సర్వే అంచనా వేసింది. తూర్పుభాగంలోని 153 సీట్లలో ఎన్డీఏ 80 నుంచి 90 సీట్లు గెలిచే అవకాశముండగా, విపక్ష ఇండియా కూటమి 50 నుంచి 60 సీట్లు పొందొచ్చని ఏబీపీ సీ ఓటర్‌ సర్వే పేర్కొన్నది. తూర్పు భారత్‌ ప్రాంతంలో ఓటింగ్‌ శాతం విషయంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 42శాతం ఓట్లు సాధించవచ్చని, ఇండియా కూటమిలోని పక్షాలకు 38 శాతం ప్రజలు ఓట్లు వేయవచ్చని వెల్లడించింది.

దక్షిణాదిలో బీజేపీకి ఎదురుగాలి
దక్షిణ భారత ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ 132 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 20 నుంచి 30 సీట్లు గెలుచుకోగలదన్న ఏబీపీ సీ ఓటర్‌ సర్వే, విపక్ష ఇండియా కూటమికి 70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశముందని తేల్చింది. మరో 25 నుంచి 35 సీట్లు ఇతరుల ఖాతాలో పడతాయని అంచనా వేసింది. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందన్న విషయమై దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలను ప్రశ్నించగా, తమిళనాడులో 53 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ప్రాధాన్యమివ్వగా, 31 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పేరునే ఎంచుకున్నారు. 2 శాతం మంది ఇద్దరిలో ఎవరూ వద్దని స్పష్టంచేయగా, మరో 14శాతం మంది తామేమీ చెప్పలేమన్నారు. ఓట్ల శాతం విషయానికొస్తే దక్షిణాదిలో విపక్ష ఇండియా కూటమి 40 శాతం ఓట్లు సాధిస్తుందని, ఎన్డీయేకు 19 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఇతర పార్టీలు 41 శాతం ఓట్లు పొందగలవని తేల్చేసింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్‌లలో కలిపి 132 లోకసభ స్థానాలున్నాయి.

ఎవరికి ఎంత శాతం ఓట్లొస్తాయి!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఎన్డీఏ గరిష్టంగా 42 శాతం ఓట్లు సాధించగలదని ఏబీపీ సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 38 శాతం, ఇతరులకు మరో 20శాతం ఓట్లు లభించవచ్చని సర్వే తేల్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు