Lalu Prasad Yadav : నా ఇంటి సంగతి నేను చూసుకుంటా .. లాలూ కీలక కామెంట్స్

రోహిణి ఆచార్య చేసిన ఘాటు వ్యాఖ్యల కారణంగా తలెత్తిన అంతర్గత ఉద్రిక్తతలపై RJD అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా  నేను ఉన్నాను, ఈ సమస్యను నేను చూసుకుంటానని చెప్పారు.

New Update
lalu

రోహిణి ఆచార్య చేసిన ఘాటు వ్యాఖ్యల కారణంగా తలెత్తిన అంతర్గత ఉద్రిక్తతలపై RJD అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా  నేను ఉన్నాను, ఈ సమస్యను నేను చూసుకుంటానని చెప్పారు. కుటుంబ కలహాలు బయటపడటంతో మీడియా లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా, ఆయన సమస్యను తన నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  తమ కుటుంబ సమస్యల్లో అతిగా జోక్యం చేసుకోవడం అనవసరపు చర్యగా  అభివర్ణించారు. తన కుటుంబంపైన ఫోకస్ చేయడం ఆపి.. ఎవరి పని వారి చేసుకుంటే మంచిదన్నారు. అంతర్గత కలహాలపై కాకుండా, పార్టీ ఐక్యత , పార్టీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పాట్నాలో జరిగిన పార్టీ శాసనసభ్యులసమావేశంలో తేజస్వి యాదవ్‌ను ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడారు.

ఇక లాలూ కుమార్తె, తేజస్వి యాదవ్ సోదరి అయిన రోహిణీ ఆచార్య తన సొంత కుటుంబం, ముఖ్యంగా తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహిత సహాయకులపై తీవ్రమైన, సంచలన ఆరోపణలు చేశారు. రోహిణి ఆచార్య తాను రాజకీయాలను వీడుతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. "నాకు కుటుంబం లేదు. మీరు వెళ్లి సంజయ్ యాదవ్, రమీజ్, తేజస్వి యాదవ్‌లను అడగండి. వారే నన్ను కుటుంబం నుండి బయటకు గెంటేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమిపై తాను ప్రశ్నించినందుకు, తనపై అసభ్యకరమైన తిట్లు  కురిపించారని, అవమానించారని, కొట్టబోయారని, చివరికి చెప్పు కూడా ఎత్తారని ఆమె ఆరోపించారు. పార్టీ ఓటమికి గల కారణాలు, ముఖ్యంగా తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ పాత్ర గురించి ప్రశ్నించినప్పుడు, ఈ దాడి జరిగిందని ఆమె తెలిపారు.

ఆర్జేడీ ఘోర పరాజయం

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం చవిచూసింది. 140కి పైగా స్థానాల్లో పోటీ చేసినా కేవలం 25 సీట్లకే పరిమితమైంది. ఈ దారుణ ఫలితాల తర్వాత తేజస్వి నాయకత్వంపై, అలాగే ఆయన నిర్ణయాలపై సంజయ్ యాదవ్ వంటి బయటి వ్యక్తుల ప్రభావంపై కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయి. రోహిణి ఆచార్య బహిష్కరణ కంటే ముందు, ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా అంతర్గత వివాదాల కారణంగా గతంలో పార్టీ,కుటుంబం నుండి బహిష్కరించబడ్డారు.

Advertisment
తాజా కథనాలు