/rtv/media/media_files/2026/02/07/launch-2026-02-07-21-41-03.jpg)
ఆనందోత్సాహాల మధ్య సాగుతున్న సూరజ్కుండ్ హస్తకళల మేళాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. మేళాలో సందర్శకులను అలరిస్తున్న 'సునామీ స్వింగ్' అనే భారీ ఊయల ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వినోదం కోసం వచ్చిన వారు రక్తపు మడుగులో విలవిలలాడారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ఏమాత్రం ఆలోచించకుండా క్షతగాత్రులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఊయల వంగిపోతుండగా దాని కింద ఉన్నవారిని పక్కకు లాగే క్రమంలో, ఊయలకు సంబంధించిన ఒక భారీ భాగం నేరుగా వచ్చి ఆయన ముఖం, తలపై బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఊయల కూలిపోవడంతో
సాయంత్రం 6:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊయల కూలిపోవడంతో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ కమిషనర్ ఆయుష్ సిన్హా పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారందరినీ అంబులెన్స్లలో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు, ఊయల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామని వెల్లడించారు.
కాగా, ప్రమాదానికి ముందు మేళా ప్రాంగణంలో భారీ గాలులు వీచినట్లు సమాచారం. గాలి ధాటికి ఫుడ్ కోర్ట్ వద్ద ఉన్న ఒక గేటు కూడా కిందపడిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Follow Us