Bangladesh Crisis: హ*త్యలు, లూటీలు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..!

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు విధ్యంసం సృష్టిస్తున్నాయి. అక్కడ ఉన్న హిందువులు టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. హిందు దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.

New Update
Bangladesh Crisis: హ*త్యలు, లూటీలు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..!

Bangladesh Crisis: అర్థరాత్రి తలుపులు కొడుతున్నారు.. తలుపు తియ్యకపోతే డోర్‌ను బద్దలు కొడుతున్నారు.. ఇంట్లో ఉన్న సమాన్లు చెల్లాచెదురుచేస్తున్నారు.. అందినకాడికి దోచుకుపోతున్నారు.. అడ్డు పడితే విచక్షణరహితంగా దాడి చేస్తున్నారు..! ఇది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన. అక్కడి యువత నిరసనలు మొదలుపెట్టిన కారణం ఒకటి.. ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి కారణం మరొకటి..! అటు తిరిగి ఇటు తిరిగి మతాలు, మైనారిటీలపై దాడులే ఎజెండాగా మారిన నిరసనలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు బిక్కిబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు దాపరించాయి.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు 

ఆగస్టు 5 రాత్రి, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన కొన్ని గంటల తర్వాత, 28 ఏళ్ల హిందూ ప్రభుత్వ ఉద్యోగికి తన అక్క నుంచి కాల్ వచ్చింది. కురిగ్రామ్ జిల్లాలోని ఒక గ్రామంలో తన ఇంటి వెలుపల గుంపు గుమిగూడిందని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్‌లో అనేకం జరుగుతున్నాయి. అటు ప్రముఖ జానపద సంగీత విద్వాంసుడు రాహుల్ ఆనందకు చెందిన 140 ఏళ్ల నాటి సాంస్కృతిక కేంద్రాన్ని దుండగులు తగలబెట్టారు. ఇలా బంగ్లాదేశ్‌లో చాలా చోట్ల మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. మొత్తం 27 జిల్లాల్లోని హిందువుల ఇళ్లు, ఆఫీస్‌లను అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. విలువైన వస్తువులను దోచుకున్నాయి.

బంగ్లాదేశ్‌-మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ దేవాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తగలబెట్టారు. అటు కేవలం ఆస్తుల విధ్వంసమే కాదు.. ప్రాణాలను సైతం తీసేస్తున్నారు.రంగ్‌పూర్ సిటీ కార్పొరేషన్‌కు చెందిన కౌన్సిలర్ హరధన్ రాయ్‌ను ఎవరో కొట్టి చంపారు. కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్లు సమాచారం. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి.

నిజానికి బంగ్లాదేశ్‌లో మైనారిటీల టార్గెట్‌గా దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు.. 2021 నుంచి హిందూ ఆలయాల టార్గెట్‌గా ఎన్నో దాడులు జరిగాయి. ప్రస్తుతం, బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతంగా ఉన్నారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22 శాతం ఉండే. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు.

మైనారిటీలతో పాటు హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సంబంధం ఉన్నవారు ఎవరూ బంగ్లాదేశ్‌లో అస్సలు సురక్షితంగా లేరు. అవామీ లీగ్ నాయకులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ అన్నిటికంటే గమనించాల్సి విషయం ఒకటి ఉంది. ఈ దాడులకు పాల్పడుతుంది అసలైన నిరసనకారులు కాదని అనేక మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల ముసుగులో కొంతమంది గుండాలు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాతే ఇస్లామీ సభ్యులు బంగ్లాదేశ్‌ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.

మరోవైపు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఎప్పుడు పనిగట్టుకోని ఉంటారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో కొన్ని వర్గాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నాయి. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. ఇంకొంతమంది ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తూ మతాన్మోదాన్ని ప్రదర్శిస్తున్నారు. అవామీ లీగ్‌ పార్టీకి చెందిన క్రికెటర్‌ మోర్తాజా ఇంటిపై నిరసనకారులు దాడి చేస్తే హిందూ క్రికెటర్‌ లితన్‌ దాస్‌ ఇంటిపై దాడి చేశారంటూ ఫేక్‌ న్యూస్‌ అల్లారు. దీన్ని క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా పలు ఇండియన్‌ న్యూస్‌ ఛానెల్స్‌ అగ్నికి ఆజ్యం పోసేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఏది ఏమైనా మైనారిటీలపై దాడులు ఏ దేశంలో జరిగినా ఖండించాల్సిందే.. వాటిని ఆపడం ప్రభుత్వాల బాధ్యత.. అంతేకానీ మా వాడిని కొట్టారు.. మేం మీ వాడిని కొడతాం అంటే అది రక్షసత్వామే అవుతుంది..!

Also Read: Sheikh Hasina:మరికొంత కాలం భారత్ లోనే షేక్ హసీనా - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు