ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభపై రాష్ర్ట ప్రభుత్వం ఆంక్షలు కొనసాగుతున్నాయి. జనగర్జన సభకు బయలుదేరిన భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యను, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఖమ్మంకు బయలుదేరిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ పోలీస్ పోలీసులు. ఆ తర్వాత వాటిని స్టేషన్కు తరలించారు.
అశ్వరావుపేటలో ఆర్టీఏ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. రాహుల్గాంధీ సభకు వ్యానుల్లో జనాన్ని తరలిస్తే కేసులు బుక్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నాగుల్ మీరా కాంగ్రెస్ సభకు వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. రాహుల్ గాంధీ సభకు వెళ్లొద్దంటూ కాంగ్రెస్ నాయకుడు ఎలగపూడి వసంతరావును బండి అడ్డుపెట్టి మరీ మీటింగ్కు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రాకుండా అడ్డకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వసంతరావు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత్రిత పాలన కొనసాగుతున్నారని మండిపడ్డారు. అయితే ఖమ్మం జన గర్జన సభకు వెళ్తున్నటువంటి ప్రజలను ఆపి అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సభకు వెళ్లే ప్రజలను మాత్రం ఆపలేరన్నారు. భద్రాచలం ఏఎస్పీ ఆర్టీవోను కలిసి సభకు వెళ్లే వారికి ఆపవద్దని చెప్పినప్పుడు ఆపమని చెప్పి మళ్ళీ ఆపడం అధికార పార్టీకి కొమ్ము కాయడమేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య అన్నారు