Lok sabha Elections 2024: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు 60% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా త్రిపురలో, నాగాలాండ్‌లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు.

New Update
Lok sabha Elections 2024: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!

First Phase Voting: లోక్ సభ ఎన్నికల (Lok sabha Elections) తొలి విడత పోలింగ్‌ (First Phase Voting) ముగిసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. అయితే సాయంత్రం 5గంటల వరకు 59.7% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. నిర్దేశించిన సమయంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి లైన్ లో నిలబడిన వారందరూ ఓటు వేసేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. అయితే నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారని, తొమ్మిది గంటలపాటు నిరీక్షించి ఎన్నికల సిబ్బంది వెళ్లిపోయారు.

లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు..
ఇక తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ 64.91, అస్సాం 70.77, బిహార్‌ 46.32, ఛత్తీస్‌గఢ్‌63.41, అండమాన్‌ నికోబార్‌దీవులు 56.87%, జమ్మూకశ్మీర్‌ 65.08, లక్షద్వీప్‌ 59.02, మధ్యప్రదేశ్‌ 63.25, మహారాష్ట్ర 54.85, మణిపుర్‌ 68.62, మేఘాలయ 69.91, మిజోరం 53.96, నాగాలాండ్‌ 56.77, పుదుచ్ఛేరి 72.84, రాజస్థాన్‌ 50.27, సిక్కిం 68.06, తమిళనాడు 62.08, ఉత్తరప్రదేశ్‌ 57.54, ఉత్తరాఖండ్‌ 53.56, పశ్చిమబెంగాల్‌ 77.57, త్రిపుర 79.83 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 66.94శాతం, సిక్కింలో 67.95శాతం చొప్పున ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

మణీపూర్, ఛత్తీస్‌గఢ్‌లో ఘర్షణలు..
తొలివిడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల దాదాపు ఒక గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేసేందుకు తరలి వచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్‌ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని కోచ్‌బిహార్‌లో తృణమూల్‌, భాజపా వర్గాల మధ్య హింస చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో గ్రనేడ్‌ దాడి జరగడంతో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Rahul gandhi: చోటుతో రాహుల్ గాంధీ సరదా.. ఫన్నీ వీడియో వైరల్!

ఒక్కరు కూడా ఓటు వేయలేదు..
నాగాలాండ్‌లో ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా 6 జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లున్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. అయితే ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక రాష్ట్రం డిమాండుతో నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO)గా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని చెబుతోన్న ఈఎన్‌పీవో.. ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌ పాటించాలని ఇటీవల ప్రకటించింది. దీంతో పోలింగ్‌ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. 4వ తేదీన ఓట్లను లెక్కించగా అదే రోజు ఎవరు దేశాన్ని పాలిస్తారనే ఉత్కంఠకు తెరపడనుంది.

Advertisment
తాజా కథనాలు