Teachers Day 2025: టీచర్స్ డే స్పెషల్: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈ అద్భుత విషయాలు తెలుసా..?

గొప్ప ఉపాధ్యాయుడు, భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని అద్భుత విషయాలు తెలుసుకుందాం.

New Update
Teachers Day

Teachers Day 2025

Teachers Day 2025: ప్రతియేటా సెప్టెంబర్ 5న మన దేశం అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపిస్తూ విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే గురువులను గౌరవించేలా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక దినాన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్(Dr. Sarvepalli Radhakrishnan) గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకుంటారు. వారు విద్యారంగంలో చేసిన సేవలు, ఆలోచనల విలువలు మరువలేనివి.

డా. రాధాకృష్ణన్ గారు 1888, సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణి అనే గ్రామంలో జన్మించారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నతనం నుండే ధార్మికంగా ఎదిగారు. వాళ్ల తండ్రి వీరస్వామి గారు, ఆయనను పూజారి కావాలని ఆశపడ్డారు. కానీ రాధాకృష్ణన్ గారి అభిరుచులు భిన్నంగా ఉండటంతో, తాను తాను కోరిన మార్గాన్ని ఎంచుకున్నారు.

Also Read: కవిత వివాదంలో బిగ్‌ ట్విస్ట్‌..హరీష్‌రావు కౌంటర్‌..

విద్యాభ్యాసం..

చిన్ననాటి నుండి చదువుపట్ల ఆసక్తి ఎక్కువ. ప్రాథమిక విద్య తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌లో చేరారు. మొదట గణితం చదవాలనుకున్నా, ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వల్ల తమ్ముడు ఇచ్చిన పుస్తకాలను చదువుతూ తత్వశాస్త్రం అభ్యసించడం ప్రారంభించారు. 1907లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

ఉపాధ్యాయునిగా ప్రస్థానం..

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1910లో ఉపాధ్యాయునిగా కెరీర్ మొదలుపెట్టి, అద్భుతంగా తమ పాఠాలను విద్యార్థులకు అందించారు. 1929లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి అతిథి లెక్చరర్‌గా ఆహ్వానం అందుకోవడం ఆయనకు గొప్ప గౌరవంగా నిలిచింది. అలాగే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొమ్మిదేళ్లపాటు వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు.

రాష్ట్రపతిగా.. 

విద్యారంగంలో పేరుపొందిన తర్వాత రాధాకృష్ణన్ గారు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1947లో UNESCOలో భారత్ తరఫున ప్రతినిధిగా సేవలందించారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన పాలనలో న్యాయం, నీతి, విద్యకు ప్రాధాన్యతను ఇవ్వడం ముఖ్యాంశంగా నిలిచింది.

ఉపాధ్యాయ దినోత్సవం ఎలా ప్రారంభమైంది?

1962లో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, విద్యార్థులు ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలని అనుకున్నారు. అయితే దానికి ఆయన ఇలా స్పందించారు - "నా పుట్టినరోజు కాదు, ప్రతి గురువుని గౌరవించడానికి ఒక రోజు జరుపుకుందాం." అలా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది.

రచనలు.. సాహిత్యం..

సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేక గొప్ప పుస్తకాలను రచించారు. "రబీంద్రనాథ్ ఠాగూర్ తత్వం" అనే రచనలో ఠాగూర్ యొక్క ఆధ్యాత్మికతను విశ్లేషించారు. "Living with a Purpose" అనే పుస్తకంలో స్వాతంత్య్ర సమరయోధుల జీవితం గురించి ఎంతో గొప్పగా తెలిపారు. "Faith Renewed" అనే గ్రంథంలో మనల్ని మనం తెలుసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు.

1954లో భారతరత్నతో సత్కరించబడ్డ రాధాకృష్ణన్ గారు, జీవితకాలంలో 27 సార్లు నోబెల్ బహుమతి కోసం నామినేట్ అయ్యారు. ఇది ఆయన విద్యా సేవలకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు.

వ్యక్తిగత జీవితం..

1903లో శివకాము అనే మహిళను సర్వేపల్లి రాధాకృష్ణన్ వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు సంతానం, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన కుమారుడు సర్వేపల్లి గోపాల్ ప్రఖ్యాత చరిత్రకారుడు.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, భారతరత్నగా నిలిచారు. ఆయన వల్లనే మనం ప్రతి సంవత్సరం గురువులను గుర్తు చేసుకుంటూ ఈ గొప్ప దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఎంతో ప్రేరణగా నిలుస్తుంది.

#Teachers Day 2025 #Teachers Day #Dr. Sarvepalli Radhakrishnan
Advertisment
తాజా కథనాలు