అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్. రమణ ఇంట విషాదం నెలకొంది. వృద్దాప్యంతో పాటు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్.రమణ తండ్రి ఎల్.గంగారాం(92) తుదిశ్వాస విడిచారు. జగిత్యాలలోని స్వగృహంలోనే గంగారాం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పితృవియోగంతో ఎమ్మెల్సీ రమణతో పాటు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
జగిత్యాలలో ఎల్.గంగారాం మంచి వ్యాపారవేత్తగా గుర్తింపుపొందారు. ఇక కొడుకు ఎల్. రమణ రాజకీయాల్లో వచ్చిన తర్వాత గంగారాం ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కొడుకు రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో ఆనందించేవారు. అయితే వృద్దాప్యంతో అనారోగ్యం బారిన పడటంతో కొంతకాలంగా గంగారాం ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇవాళ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్సీ రమణతో పాటు కుటుంబసభ్యులు బాధలో మునిగిపోయారు.
ఎల్. రమణ తండ్రి మృతి చెందినట్లు తెలిసి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు నివాళులార్పిస్తున్నారు. బాధలో వున్న రమణ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎల్.రమణ తండ్రి గంగారాం మృతికి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.
[vuukle]