Kolkata case: కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు!

అభయ అత్యాచార ఘటనపై కోల్‌కతాలో విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సచివాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకోగా స్టూడెంట్స్ రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ర్యాలీని అడ్డుకోవద్దని గవర్నర్ ఆనంద్ సూచించారు.

New Update
Kolkata case: కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు!

Kolkata: కోల్‌కతాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జూనియర్ డాక్టర్‌ అభయ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నబన్న మార్చ్‌ పేరిట విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే పెద్ద ఎత్తన తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

దీంతో తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసు బలగాలు వెంటనే విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వాటర్‌ కెనాన్స్‌, బాష్పవాయువు ప్రయోగించారు.

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు..
ఈ క్రమంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులను అడ్డుకునేందుకు సచివాలయాన్ని అష్టదిగ్బంధం చేశారు. 6 వేల మంది పోలీసులతో మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లను అడ్డుగా పెట్టారు. అయినా నిరసనకారులు దూసుకురావడంతో వెంటనే స్పందించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. విద్యార్థుల శాంతియుత ర్యాలీని అణిచివేయవద్దని పోలీసులను కోరారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించారు.

Advertisment
తాజా కథనాలు