ఎన్నికల కార్యాచరణ మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన రోడ్ మ్యాప్ గురించి వివరించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 120 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళడం గురించి చర్చించినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆఫీస్లో సుమారు రెండున్నర గంటలకుపైగా జరిగిన స్ట్రాటెజీ మీటింగ్ వివరాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ థాక్రే, రేవంత్రెడ్డి, ఉత్తమ్ తదితరులకు సంబందించి వివరించారు.
ప్రజల దృష్టికి మోదీ-కేసీఆర్ వైఫల్యాలు
పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని, పదేళ్ళుగా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, మోదీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో చర్చించుకున్నట్లు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నికల కార్యాచరణ మొదలైందని రేవంత్ వ్యాఖ్యానించారు. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ అగ్రనేతలు సూచించారని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం
ఎక్కెడక్కడ పార్టీ నిర్మాణంలో ఖాళీల ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసుకుంటామన్నారు. ఎన్నికలకు కార్యకర్తలను, నాయకులను సన్నద్ధం చేసుకునే ప్రక్రియ ఈ సమావేశంతో మొదలైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నామో వివరించే మేనిఫెస్టో తయారీపైనా, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చనున్నదో చర్చించామన్నారు.
అవినీతి పైకి.. అభివృద్ధి కిందకి
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని, అభివృద్ధి మాత్రం పాతాళంలోకి వెళ్ళిందనే చర్చ ఈ సమావేశంలో జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ గురించి చర్చించామన్నారు. భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంటామన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫార్ములా..
కేసీఆర్ను గద్దె దించడానికి అవసరమైన ఎన్నికల యాక్షన్ ప్లాన్ ఈ సమావేశంతోనే మొదలైందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా గురించి ఖర్గే, థాక్రే తదితరులు ఈ సమావేశంలో తమకు వివరించారని, వారి అనుభవాలను పంచారని తెలిపారు. అదే తరహాలో పదునైన కార్యాచరణతో తెలంగాణలో అధికారంలోకి రావడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఖరారైందన్నారు.