Modi Politics: రాజకీయాల్లో బీజేపీ స్టైల్ వేరు. అందులోనూ మోదీషా రాజకీయాల ఒరవడి వేరు. అప్పటిదాకా ఎలా ఉన్నా.. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వీరి పద్ధతే మారిపోతుంది. ప్రతి రోజూ ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పని ఎదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎన్నికల కోసం ఎదో అప్పటికప్పుడు వాటిని చేసినట్టు కూడా అనిపించదు. కానీ, ఇంపాక్ట్ మాత్రం ప్రజల్లో మోదీ ఇమేజ్ పెంచేలా ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ మోదీ సర్కార్ చివరి క్యాబినెట్ మీటింగ్. సాధారణంగానే, ఎన్నికల ముందు వచ్చే చివరి క్యాబినెట్ మీట్ అంటే, ప్రజలకు రకరకాల తాయిలాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఓటర్లను ఆకర్షించే మంత్రాలే ఉంటాయి. మరి సార్వత్రిక ఎన్నికల ముందు.. రెండు సార్లు వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ.. ఊరకే ఉంటుందా? ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే పని చేసేయదూ. సరిగ్గా అదే చేసింది మోదీ (Modi Politics)చివరి క్యాబినెట్ మీట్. అసలు మోదీ సర్కార్ తన చివరి క్యాబినెట్ మీట్ లో ఏం ప్రకటించారు? ఒకసారి చూద్దాం.
పీఎం ఉజ్వల స్కీం..
Modi Politics: పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభిస్తోంది.
ముడి జనపనార మద్దతు ధర పెంపు..
Modi Politics: రైతులకు గుడ్ న్యూస్.. ముడి జనపనార మద్దతు ధర పెంచింది. 2024-25 సీజన్లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర(MSP) క్వింటాల్కు రూ. 5,335 గా పేర్కొంది, గత సీజన్తో పోలిస్తే క్వింటాల్కు రూ. 285 పెంచింది ప్రభుత్వం.
AI పై స్పెషల్ ఫోకస్..
Modi Politics: ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) పై భారత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 10,000 కోట్ల బడ్జెట్తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
Modi Politics: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది మోడీ సర్కార్(Modi Sarkar). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచింది. ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ 2024 జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది.
భారత సైన్యానికి మరింత బలం..
Modi Politics: భారత సైన్యానికి మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డు కోసం 34 కొత్త ధృవ్ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇండియన్ ఆర్మీకి 25, ఇండియాన్ కోస్టల్ గార్డుకు 9 హెలికాఫ్టర్లు కేటాయించనుంది.
ఈశాన్య ప్రాంతాలకు పెద్ద పీట..
Modi Politics: అభివృద్ధి వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద పీట వేసింది. ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు రూ.10,037 కోట్ల పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
వీటితో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటి గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.
సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో.. ప్రభుత్వం అన్నివర్గాలను ముఖ్యంగా రైతులు.. మహిళలు.. గిరిజనులు వీరి ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని వ్యవహరించిందని(Modi Politics) చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ పై 300 రూపాయల తగ్గుదల అంటే సామాన్యమైన విషయం కాదు. ఉజ్వల పథకం లబ్దిదారులకు ఇది పెద్ద ఊరటే. దానికి కొనసాగింపుగా సిలెండరుపై అందరికీ 100 రూపాయల తగ్గింపు కచ్చితంగా మహిళలపై ప్రభావం చూపించేదే అని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు ఎంత పెంచారు? ఎంత తగ్గించారు? అంటూ గోల చేసినా.. ధర తగ్గించడం అనే ప్రకటన ముందు ప్రజలకు ఆ లెక్కలు ఆనవు అనేది నిజం.
జనపనార మద్దతు ధర పెంపుదల అనేది రైతు ఓటు బ్యాంక్ పై గట్టి ఇంపాక్ట్ చూపించేదిగానే చెప్పవచ్చు. దీని వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. వీరి మద్దతు కచ్చితంగా బీజేపీ దక్కుతుందని చెప్పవచ్చు.
Also Read: మహిళా దినోత్సవం.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయాలు!
అలాగే, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధికి తీసుకువచ్చిన ఉన్నతి పథకం. కాంగ్రెస్ పార్టీకి కాస్త పట్టు ఉన్న ఈశాన్య ప్రాంతాల ఓటు బ్యాంకుపై కన్నేసిన మోదీ సరైన సమయంలో ఈ పథకం ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు నిధులు కేటాయించడం గిరిజనుల ఓటు బ్యాంకుపై నేరుగా ప్రభావం చూపిస్తుందని వేరే చెప్పక్కర్లేదు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నట్టు కనిపిస్తున్న ఈ తరుణంలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందుగా ప్రకటించిన ఈ తాయిలాలు కచ్చితంగా బీజేపీకి మరింత ఊపును ఇస్తాయని చెప్పవచ్చు. ఎన్నికల ముందు ఈ విధంగా నిధుల పందేరం ప్రతిపక్షాలకు మోదీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పవచ్చు. ఇంకా ఎన్నికల నగారా మొగడానికి కొద్దిరోజుల సమయం ఉంది. ఈ మధ్యలో కూడా మోదీ కచ్చితంగా మరిన్ని వరాల మూటలతో ప్రతిపక్షాలకు చికాకు పుట్టించడం ఖాయం.