/rtv/media/media_files/2026/03/09/chat-gpt-2026-03-09-13-50-29.jpg)
సాంకేతికతను మంచి పనుల కోసం వాడాల్సిన విద్యావంతులే దారి తప్పారు. పరీక్షల్లో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన ఇన్విజిలేటర్లే ఏకంగా AI వాడి విద్యార్థులకు ఆన్సర్లు పంపారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇటీవల 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు జరిగాయి. అయితే, బీడ్ జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతోందని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
పరీక్షా కేంద్రాల్లోని సిబ్బంది సాదాసీదాగా కాకుండా, లెటెస్ట్ ఏఐ టెక్నాలజీ చాట్జీపీటీ అప్లికేషన్ను ఉపయోగించి విద్యార్థులకు కాపీయింగ్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఎగ్జామ్ పేపర్లో ప్రశ్నలను చాట్జీపీటీలో సెర్చ్ చేసి, వచ్చిన సమాధానాలను విద్యార్థులకు అందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రోన్ కెమెరాలు, నిఘా బృందాల తనిఖీల్లో ఈ అక్రమాలు నిర్ధారణ అయ్యాయి.
81 మంది సిబ్బందిపై వేటు
ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, మాస్ కాపీయింగ్కు సహకరించినట్లు తేలిన 81 మంది ఎగ్జామినేషన్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో టీచర్లు, ఇతర పర్యవేక్షక సిబ్బంది ఉన్నారు. విద్యా వ్యవస్థను అప్రతిష్టపాలు చేసే ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి హైటెక్ మోసాలు జరగకుండా ఉండేందుకు విద్యాశాఖ మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచడం. సిబ్బంది మొబైల్ ఫోన్ వినియోగంపై కఠిన ఆంక్షలు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ప్రభుత్వం హెచ్చరించింది.
Follow Us