పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ
తెలంగాణ బీజేపీలో గత కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేతల్లో వర్గ విబేధాలు ఓ వైపు సాగుతుంటే.. మరోవైపు అసంతృప్తి, దానికి తోడు సొంత పక్షంవారిపైనే విమర్శలతో బీజేపీ నాయకులు నెట్టుకొస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో తెలంగాణ అధ్యక్షుడిని మారుస్తారనే వార్త బయటకొచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డిని నియమించి, ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్లాన్
మరోవైపు రాష్ట్రంలోని బీజేపీ ఈ మధ్యకాలంలో వరుసగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈ ఇద్దరి తర్వాత బండి సంజయ్, కిషన్రెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లినప్పుడు ఢిల్లీ వేదికగా ఏదో జరుగుతోందని కార్యకర్తలు భావించారు. అయితే.. అగ్రనేతలంతా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి..? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి..? అనే విషయాలన్నీ చర్చించాకే ఢిల్లీకి పిలిపించి విపులంగా వివరించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీలో చేరినవారితోపాటు బై ఎలక్షన్లో గెలిచిన డీకే అరుణ, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి, రఘునందన్లకు పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేశారట.
మరోసారి వివాదాస్పద ట్వీట్
ఇది ఇలా ఉంటే..రాష్ట్ర బీజేపీ శాఖపై వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన మాజీ ఎంపీ, బీజేపీ నేత ఏపీ జితేందర్రెడ్డి మరోసారి న్యూస్ మేకర్గా మారారు. పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావును జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని పార్టీ హైకమాండ్ను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. రఘునందన్రావు మాట్లాడుతున్న వీడియోను ట్వీట్కు జత చేశారు. ప్రౌడ్ ఆఫ్ యువర్ వాయిస్, ఐ సపోర్ట్ యూ యాస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ అని బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డాలకు ట్వీట్ను జత చేశారు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.